న్యూఢిల్లీ: తన చుట్టూ నలుగురు బలమైన మహిళలున్నారంటూ మహిళా దినోత్సవం రోజున రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ వేదికగా తన మనసులోని భావాలను పంచుకున్నారు. తన తల్లి, అత్త, భార్య, కుమార్తె.. అంటూ ఆ నలుగురి గురించి చెప్పారు. వాళ్ల గురించి వివరించాలంటే.. ‘కష్టపడి పనిచేసేవారు, ధైర్యవంతులు, కరుణామయులు, నిబద్ధత కలవారు’ అంటూ ప్రియాంకా గాంధీ భర్త చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ లో ఆయన పెట్టిన వాటిలో ఒక ఫొటోలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, వాద్రా తల్లి మౌరీన్ వాద్రా.. వీరిద్దరూ రాబర్ట్ వాద్రాతో కలిసి ఉన్నట్లు కనిపించారు. మరో ఫొటోలో ప్రియాంకా గాంధీ, ఆమె కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా తన సందేశాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు.
‘‘నా సందేశం: ఈ రోజే కాదు.. ప్రతిరోజూ మీదే! దాన్ని ఆస్వాదించండి. భారతదేశం మీ కలలకు సురక్షితం కావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈడీ విచారణ పూర్తయ్యి తాను తిరిగొచ్చిన తర్వాత వాళ్లందరితో కలిసి సంబరాలు చేసుకుంటానని, ఇప్పటికే విచారణకు సహకరిస్తూ 10 రోజుల్లో సుమారు 64 గంటలు అక్కడే ఉన్నానని చెప్పారు. తమ హక్కుల కోసం నిలబడినవారు, వ్యాపార, శాస్త్ర సాంకేతిక, ఆర్థిక, క్రీడా రంగాలలో పేరు సంపాదించిన చాలామంది మహిళలు తనకు తెలుసని కూడా ఈ సందర్భంగా తెలిపారు. పలు ఆర్థిక పరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న రాబర్ట్ వాద్రా ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. డీఎల్ఎఫ్ కుంభకోణంలో ఆయన పాత్ర ప్రధానమని అంటున్నారు.