(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తమిళనాడులోని తిరుచ్చాపల్లి జిల్లా నడుకట్టుపట్టి గ్రామంలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుజిత్ విల్సన్ కథ విషాదాంతమైంది. నాలుగు రోజులుగా చేసిన రెస్యూ ఆపరేషన్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. బోరుబావిలో చిన్నారి సుజిత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెల్లడించారు. బోరు బావి నుంచి కుళ్లిన వాసన వస్తుండటంతో.. చిన్నారి చనిపోయాడని గుర్తించిన ఫైర్ సిబ్బంది.. క్రేన్ ద్వారా మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తరువాత చిన్నారి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బయటకు తీసుకువచ్చే సమయానికి బాడీ డీకంపోజింగ్ స్టేజీలో ఉండగా.. మృతదేహాన్ని చూసి చిన్నారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎప్పటికైనా బిడ్డను ప్రాణాలతో చూస్తాననుకున్న సుజిత్ తల్లి ఆశలు అడియాశలయ్యాయి.
అక్టోబర్ 25 శుక్రవారం సాయంత్రం 5.30గంటల సమయంలో బోర్ బావి దగ్గరకు వెళ్లిన సుజిత్.. ప్రమాదవశాత్తు అందులో 35 అడుగుల లోతుకు పడిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. అతడిని బయటకు తెచ్చేందుకు గత నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేసింది. చిన్నారిని బయటకు తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మరింత లోతుకు జారి.. ఏకంగా 90 అడుగల లోతుకు వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా ఆహారం, నీరు లేకుండా పోవడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారి.. మృతి చెందాడు. అయితే సుజిత్ సురక్షితంగా బయటకు రావాలని దేశమంతా కోరుకుంది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, సినీ నటుడు రజనీకాంత్ సహా పలువురు ఈ ఘటనపై స్పందించారు. బాలుడు క్షేమంగా బయటకు రావాలని కోరుకున్నారు. అయితే వారి ప్రార్థనలు ఫలించకపోగా.. ఆ బాలుడి మరణం అందరిలో శోకాన్ని నింపింది.