అమరావతి: అందరూ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. గురువారం ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
13జిల్లాలలో 25 పార్లమెంట్ స్థానాలకు, 55 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో రెండు హాళ్లు ఉండగా 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభకు వేర్వేరు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును శివాజీ ఇంజనీరింగ్ కళాశాలలో, మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఓట్లను ఎంజివిఆర్ కళాశాలలో లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు.
విశాఖపట్నం,అరకు, అనకాపల్లి పార్లమెంట్ స్థానాల పరిధిలోని ఓట్ల లెక్కింపునకు ఆంధ్రా యూనివర్శిటీలో ఏర్పాటు చేశారు.
కాకినాడ పార్లమెంట్తో పాటు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు అదికవి నన్నయ యూనివర్శిటీలో, అమలాపురం పార్లమెంట్తో పాటు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు అమలాపురం జిల్లా క్రీడాప్రాదికార సంస్థ ప్రాంగణంలో, రాజమండ్రి పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ ఓట్ల లెక్కింపు సిటీ ఐడియల్ కళాశాలలో, ఏలూరు పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు రామచంద్ర ఇంజనీంగ్ కళాశాలలో, నర్సాపురం పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు విష్ణు డెంటల్ కళాశాలలో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మచిలీపట్నం పార్లమెంట్తో పాటు ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కృష్ణాయూనివర్శిటీలో, విజయవాడ పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో, గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపునకు నాగార్జున యూనివర్శిటీలో, నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఓట్ల లెక్కింపునకు లయోలా పబ్లిక్ స్కూల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
బాపట్ల లోక్సభ, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఓట్ల లెక్కింపునకు టంగుటూరులోని కృష్ణా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు రాయలసీమ యూనివర్శిటీలో, కర్నూలు లోక్సభ ఓట్ల లెక్కింపునకు రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాల, పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.
అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఓట్ల లెక్కింపునకు జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాలలో, హిందూపురం పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు ఎస్కె యూనివర్శిటీలో, కడప పార్లమెంట్తో పాటు రాజంపేటలోని మూడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు కెఎల్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో, మరో నాలుగు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు.
నెల్లూరు పార్లమెంట్ ఓట్ల లెక్కింపు డికె ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించనున్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సర్వేపల్లి, గూడురు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రియదర్శని కళాశాలలో, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ ఆర్కెఎం లా కళాశాలలో, చిత్తూరు లోక్సభ పరిధిలోని ఓట్ల లెక్కింపునకు శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.