న్యూఢిల్లీ: ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-2 ల్యాండర్ లైఫ్పై ఆశలు ఇక లేనట్లే. చంద్రగ్రహం ఉపరితలంపై నెమ్మదిగా ల్యాండర్ విక్రంను దింపి దానితో పరిశోధనలు చేయిద్దామనుకున్న ఇస్రో పధకం చివరివరకూ బాగానే నడిచింది. రెండు వారాల క్రితం జిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఆర్బిటర్ చక్కగా కక్ష్యలో ప్రవేశించింది. దాని నుంచి విడిపోయిన విక్రం మాత్రం చంద్రగ్రహం ఉపరితలానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో గతి తప్పి క్రాష్ ల్యాండింగ్ అయింది. దానిని తిరిగి తమ అదుపులోకి తెచ్చుకునేందుకు ఇస్రో శతవిధాలా ప్రయత్నించింది.
ఇక ఆ ప్రయత్నాలు ముగిసిపోయినట్లే. సవ్యంగా దిగితే విక్రం జీవితకాలమే 14 రోజులు. దానికి తోడు విక్రం దిగడానికి ప్రయత్నించిన దక్షిణధృవ ప్రాంతం ఈ రోజు రాత్రిలో ప్రవేశిస్తున్నది. దీనివల్ల ల్యాండర్ పని చేయాలంటే కావాల్సిన సౌరశక్తి తయారు కావడానికి అవసరమైన ఎండ అక్కడ మాయమవుతుంది. చంద్రుడి మీద ఒక రాత్రి భూమి లెక్కల ప్రకారం 28 రోజులు ఉంటుంది. రాత్రి పూట అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతుంది. మనం ఊహించలేని ఆ చలిలో ల్యాండర్ పరికరాలు రాయిలాగా గడ్డకట్టి పోతాయి.
ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగి ఉంటే భారత్ ఈ ఘనత సాధించిన నాలుగవ దేశం అయిఉండేది. చంద్రయాన్-2 కోసం భారత్ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.