(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెల్లగా ఉన్నవారే అందగత్తెలన్న అభిప్రాయాన్ని పెంచి పోషించే ఫెయిర్నెస్ క్రీములను వ్యతిరేకించే వారి జాబితాలో తాజాగా దక్షిణాది నటి సాయిపల్లవి చేరింది. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ రెండు కోట్ల రూపాయల విలువైన ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ కాంట్రాక్ట్ను తిరస్కరించింది. మన రంగు మనదే. ‘తెల్లవారి దగ్గరకు వెళ్లి మీరు ఎందుకు తెల్లగా ఉన్నారని ప్రశ్మించగలమా? ఆఫ్రికన్లకు వారి సొంత రంగు ఉంది. ఎంత అందంగా ఉంటారు వాళ్లు’ అని సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
‘అలాంటి వాణిజ్య ప్రకటన ద్వారా సంపాదించిన డబ్బు ఏం చేసుకోవాలి? నేను ఇంటికి వెళ్లి మూడు చపాతీలు తింటాను. కారులో తిరుగుతాను. నాకు పెద్ద అవసరాలు లేవు. నాచుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టగలనేమో చూస్తాను. మనం చూసే ఈ ప్రమాణాలు తప్పు అని చెబుతాను’ అని సాయిపల్లవి పేర్కొన్నది.
https://www.instagram.com/p/BX4bl41A4fJ/?utm_source=ig_web_copy_link
కంగనా రనౌత్ కూడా గతంలో ఫెయిర్నెస్ క్రీముల ప్రకటనను తిరస్కరించింది. షారుక్ ఖాన్, సోనమ్ కపూర్ అలాంటి ప్రకటనల్లో నటిస్తూ వచ్చారు. వారు అలాంటి ప్రకటనల్లో నటించడాన్ని మరో హిందీ నటుడు అభయ్ దేవల్ బహిరంగంగా తప్పు పట్టాడు. మరో గొప్ప నటి నందితా దాస్ నలుపే అందం అనే ఉద్యమం నడుపుతోంది. ‘ఇలాంటి ప్రకటనల వల్ల నల్లగా ఉన్నవారు అత్మన్యూనతకు లోనవుతారు. ఫెయిర్నెస్ క్రీముల ప్రకటనలు మనకు ఏం చెబుతున్నట్లు? నువ్వు నల్లగా ఉన్నావు లాభం లేదు. నీకు భర్త దొరకడు. బాయ్ఫ్రెండ్ దొరకడు అని చెబుతున్నట్లే’ అంటుంది నందితా దాస్.