న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైన బీజేపీకి ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఝార్ఖండ్ లోనూ సీట్ల పంపకాల విషయంలో బీజేపీ మిత్రపక్షాలైన ఎల్జేపీ, ఏజేఎస్ యూల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఝార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న ప్రారంభమై ఐదు విడుతల్లో జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. మొత్తం 81 స్థానాలకు గానూ 50 స్థానాల్లో ఎల్జేపీ పోటీ చేస్తుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను మంగళవారం సాయంత్రానికి విడుదల చేస్తామని చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు.
2014 ఎన్నికల్లో బీజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్ యూ), లోక్ జన్ శక్తిపార్టీ(ఎల్ జేపీ)తో కలిసి పోటీ చేసి విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 72 చోట్ల పోటీ చేసి 37 స్థానాల్లో విజయం సాధించగా.. ఏజేఎన్ యూ ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి ఐదు చోట్ల గెలుపొందింది. పొత్తులో భాగంగా ఎల్జేపీ ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. అయితే, తాజాగా జరగబోయే ఎన్నికల్లో మాత్రం ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ ఎన్నికల్లో తమకు 19 సీట్లు కేటాయించాలని ఏజేఎన్ యూ బీజేపీని పట్టుబట్టింది. కానీ బీజేపీ మాత్రం తొమ్మిది సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేందుకు సుముఖంగా లేదు. ఇప్పటికే ఏజేఎస్ యూ 12 స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఏజేఎన్ యూ ప్రకటించిన నాలుగు స్థానాల్లో బీజేపీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడం గమనార్హం. చక్రధర్ పూర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్మణ్ గిలుయా బరిలోకి దిగుతుండగా.. ఇదే స్థానంలో ఏజేఎస్ యూ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నట్లు స్పష్టమైంది. ఏజేఎస్ యూకు సర్దిచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నా.. సీట్ల విషయంలో మాత్రం గట్టిగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), ఆర్జేడీతో కలిసి పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 62 చోట్ల పోటీ చేసి కేవలం ఆరు స్థానాల్లో గెలవగా.. జేఎంఎం 19 స్థానాల్లో విజయం సాధించింది. ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. తొలి విడుతలో 13 స్థానాలకు నవంబర్ 30న, రెండో విడుతలో 20 నియోజకవర్గాలకు డిసెంబర్ 7న, మూడో విడుతలో 17 స్థానాలకు డిసెంబర్ 12న, నాలుగో విడుతలో 15 స్థానాలకు డిసెంబర్ 16న, చివరి విడుతలో 16 నియోజకవర్గాలకు డిసెంబర్ 20న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విజయం సాధించాయి. అయితే, సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలనే డిమాండ్ కు బీజేపీ అంగీకరించపోవడంతో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనప్పటికీ మెజార్టీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైంది. ఇప్పుడు ఝార్ఖండ్ లోనూ మిత్రపక్షాల నుంచి బీజేపీకి తలనొప్పి మొదలు కావడంతో రాష్ట్రంలో అధికారం దూరమవుతుందా అనే ఆందోళన ఆపార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.