హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ను ఎనిమిది గంటల పాటు శ్రమించి రైల్వే అధికారులు బయటకు తీశారు. ప్రమాదానికి సంబంధించిన సిసి టివీ పుటేజ్ను అధికారులు విడుదల చేశారు.
కర్నూలు – సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను లింగంపల్లి నుండి ఫలక్నుమా వెళుతున్న ఎంఎంటిఎస్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంఎంటిఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా మరో 13మందికిపైగా గాయపడ్డారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన లోకోపైలెట్ను కాపాడేందుకు సిబ్బంది అతనికి ఆక్సిజెన్, సెలైన్ అందించి గ్యాస్ కట్టర్తో క్యాబిన్ను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. లోకోపైలెట్ చంద్రశేఖర్ సుమారు ఎనిమిది గంటల పాటు నరకయాతన అనుభవించాడు.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నెమ్మదిగా పట్టాలు మారుతుండటం, ఎంఎంటిఏస్ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం జరిగిన వెంటనే రైలులో నుండి ప్రయాణీకులు బయటకు పరుగులు తీయడం సిసి టీవి పుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ప్రమాదం సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణంగా జరిగిందని తొలుత అధికారులు భావించారు. అయితే డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఎజిఎం బిబి సింగ్ వెల్లడించారు. సిగ్నలింగ్ వ్యవస్థ తప్పులేదని ఆయన తెలిపారు. సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలెట్ ఎంఎంటిఎస్ రైలును ముందుకు తీసుకువెళ్లాడనీ, దాని వల్లనే పమాదం జరిగిందనీ ఆయన చెప్పారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడవుతాయని సింగ్ తెలియజేశారు.