అమరావతి: ఏపీలో జనవరి 1 నుంచి ప్రారంభం కావాల్సిన వార్డు, గ్రామ సచివాలయ సేవలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జనవరిలోనే మరో రోజున ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామకం కూడా పూర్తయింది. కానీ, వార్డు, గ్రామ సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తికాకపోవడంతో సేవలు ఆలస్యం అవుతున్నాయి.
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం 2020 జనవరి 1వ తేదీ నుంచి గ్రామ సచివాలయ పాలన ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు ఏర్పాట్లు కూడా చేశారు. జనవరి 1 నుంచి సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనుకున్న స్థాయిలో మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు. ఇప్పుడే ప్రారంభిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం.. సచివాలయ పాలనను తాత్కాలికంగా వాయిదా వేసింది.
మీ-సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న వివిధ సేవలను ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చింది. మీ-సేవా కేంద్రాల్లో నగదు చెల్లించి పొందుతున్న ప్రభుత్వ సేవలన్నీ ఇక మీదట సచివాలయాల్లో ఉచితంగా పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయాలు ఉండడం, ఆన్లైన్ సేవలు ఉచితంగా అందుబాటులోకి రానుండడంతో ప్రజలు అటు వైపే మొగ్గుచూపుతారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్లోనే సేవలను నిర్ణీత గడువులోగా అందించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలను మూడు రకాలుగా విభజించారు. కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే స్పాట్ లోనే అందిస్తారు. ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తర్వాత అందిస్తారు. గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్ను సీఎం డ్యాష్ బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. ప్రజలకు అందించాల్సిన సేవలపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు.
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు సెప్టెంబరు 19న విడుదలయ్యాయి. పరీక్షలకు మొత్తం 19,50,630 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 1,98,164 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు.