(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు జనవరి ఒకటవ తేదీన సతీమణి భువనేశ్వరితో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించి రైతాంగానికి సంఘీభావం తెలియజేయనున్నారు.అమరావతి ప్రాంత రైతాంగం ఆందోళనలో ఉన్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
సిఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నుండి తరలించడానికి వీలులేదంటూ రెండు వారాలుగా గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు..అమరావతి ప్రాంత రైతాంగానికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఖర్చు చేసే డబ్బును జెఎసిలకు, అమరావతి పరిరక్షణ సమితికి విరాళంగా ఇవ్వాలని సూచించారు. ఎవరూ బొకేలు, కేక్ల కోసం ఖర్చు చేయవద్దనీ, తన వద్దకు తీసుకురావద్దని చంద్రబాబు కోరారు.
అమరావతి రైతులు రోడెక్కి ధర్నాలు చేస్తున్నారనీ, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందనీ తెలిపారు. జనవరి ఒకటవ తేదీ బుధవారం సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో పర్యటించి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలియజేయడంతో పాటు ధర్నాలో కూడా పాల్గొంటారు.