కడప: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 54లక్షల మంది రైతు కుటుంబాలకు 8750కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా 15.36లక్షల మంది కౌలు రైతులు కూడా ప్రయోజనం కలుగుతోందని జగన్ పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని రైతు దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ గత ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందనీ, అందుకే రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టామని జగన్ అన్నారు. ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు. అక్టోబర్ 15నుండి వైఎస్ఆర్ భరోసా పథకం కింద 12,500 రూపాయలు అందజేస్తామని జగన్ అన్నారు.
వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళిక రచిస్తున్నామని జగన్ చెప్పారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్కు కలపడం వల్ల ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందని జగన్ పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అంగీకారం తెలిపారని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో కడప జిల్లాకు ప్రతిపాదించిన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ తెలిపారు. కెజి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కందూ నదిపై రాజోలి, జలదరాశి ప్రాజెక్టు నిర్మిస్తామనీ, డిసెంబర్ 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ నది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మసాగర్కు నీళ్లు తీసుకొస్తామని జగన్ చెప్పారు. ఈ సభలోనే వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ పథకాన్ని జగన్ ప్రారంభించారు. తాను హామీ ఇచ్చిన ప్రకారం నవరత్న పథకాలను కశ్చితంగా అమలు చేస్తామని జగన్ వాగ్దానం చేశారు. పెన్షన్ రాకుంటే నేరుగా సిఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలనీ, ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారు. సెప్టెంబర్ ఒకటి నుండి నేరుగా సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటికే చేరతాయని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తోందనీ, ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందని జగన్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది డిసెంబర్ 26న కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని జగన్ ప్రకటించారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామనీ, 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ చెప్పారు. రైతాంగానికి మార్కెట్ కమిటీల ద్వారా సక్రమంగా సేవలు అందేందుకు గానూ ఎఎంసిలకు ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నట్లు జగన్ తెలిపారు, ఈ సభలో వ్యవసాయ శాఖ మంత్రి కె కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.