అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ను వివిధ సర్వే సంస్థలు కొద్దిసేపటి క్రితమే ప్రకటించాయి. అయితే.. ఈ సర్వేల తీరు చూస్తుంటే.. ప్రజల్లో తీవ్ర గందరగోళం, అయోమయం కలుగుతున్నాయనే చెప్పాలి. కొన్ని సంస్థల సర్వేలు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి మెజారిటీ వస్తున్నట్లు తేల్చాయి. మరి కొన్ని సర్వేలు మాత్రం చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీకే ఆంధ్రా ఓటర్లు మరోసారి పట్టం కట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక జనసేన పార్టీకి ఏ సర్వేలో అయినా మూడో స్థానమే దక్కడం గమనార్హం. ఐఎన్ఎన్ఎన్ సర్వేలో అయిదు సీట్లు, వీడీపీ అసోసియేట్స్ సర్వేలో నాలుగు స్థానాల వరకూ మాత్రమే రావొచ్చని తేల్చాయి. ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుని ఐదేళ్ళూ కాలక్షేపం చేసిన బీజేపీకైతే ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం ఏ సర్వేలోనూ లేకపోవడం విశేషం.
నిజానికి ఎగ్జిట్పోల్స్ చూస్తుంటే.. ఏ సర్వేని విశ్వసించాలో తెలియక ఆంధ్రప్రదేశ్ ప్రజలు గందరగోళంలో పడిపోయారనే చెప్పాలి. సర్వేలు చేస్తూ.. ఆంధ్రా ఆక్టోపస్గా పేరు పడిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే, ఐఎన్ఎన్ఎన్ సర్వేలు తప్ప మిగతావన్నీ వైసిపీయే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించాయి. అయితే.. రాజకీయాల్లో మార్పు నినాదంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బరిలో దిగిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి మాత్రం అన్ని ఎగ్జిట్పోల్స్లోనూ మూడో స్థానమే రావడం గమనార్హం.
లగడపాటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పది స్థానాలు అటూ ఇటూగా 90 నుంచి 110 సీట్లు రావచ్చు. ఇక వైసిపీకి ఆయన సర్వేలో కొన్ని సీట్లు అటూ ఇటూగా 65 నుంచి 79 స్థానాలు రావచ్చని తేలింది. ఇండియా టు డే సర్వే ప్రకారం టీడీపీకి కేవలం 37నుంచి 40 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తున్నాయట. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైసిపికి ఇండియా టు డే సర్వేలో 130 నుంచి 135 అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి. జనసేనకైతే ఒక్క స్థానం వచ్చే అవకాశాలున్నట్లు చెబుతోంది. మరో సర్వే సంస్థ ఐఎన్ఎన్ఎన్ సర్వేలో టీడీపీకి 118 స్థానాలు, వైసిపీకి 52 సీట్లు వస్తాయని, జనసేన పార్టీకి అయిదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. సీపీఎన్ సర్వేలో వైఎస్సార్సీపీకి 130 నుంచి 133 సీట్లు, టీడీపీకి 43 లేదా 44 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వే కూడా జనసేనకు ఒక్క స్థానం దక్కే వీలుందని తెలిపింది. వీడీపీ అసోసియేట్స్ సంస్థ సర్వేలో కూడా వైఎస్సార్సీపీయే 111 నుంచి 121 అసెంబ్లీ స్థానాల్లో విజయ ఢంకా మోగించి అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు స్పష్టం చేసింది. చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి అయితే.. కేవలం 54 నుంచి 60 సీట్లు దక్కే అవకాశం ఉందంటూ చెప్పింది. ఇక జనసేన పార్టీకీ నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఏతా వాతా తేలుతోందేంటంటే.. ఈ ఎగ్జిట్పోల్స్లో ఏ సర్వే సంస్థ ఓటర్ల పల్స్ సరిగ్గా పసిగట్టగలిగిందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా.. ఈ నెల 23న సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడతాయి. ఆ రోజుతో ఎవరు రాజో, ఎవరు మంత్రో స్పష్టం కానుంది.