(న్యూస్ అర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధికారంలోకి రాబోతోందని జాతీయ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. లోక్సభ స్థానాల్లోనూ వైసిపి విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టిడిపికి పరాజయం తప్పదని తేల్చాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది.
లోక్సభ ఎన్నికల్లో వైసిపికి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి నాలుగు నుంచి ఆరు సీట్లు రావొచ్చని తెలిపింది.
ఆరా సర్వే ప్రకారం వైసిపికి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టిడిపికి ఒకటి నుంచి అయిదు ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైసిపికి 18 సీట్లు టిడిపికి ఏడు సీట్లు రావొచ్చని అంచనా.
అసెంబ్లీ ఎన్నికల్లో…
ఆంధ్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి 130 నుంచి 133 వరకు సీట్లు వస్తాయని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సిసిఎస్) అంచనా వేసింది. టిడిపికి 43 నుంచి 44 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి సున్నా నుంచి ఒక స్థానం వరకు రావొచ్చని తెలిపింది.
వైసిపికి 112, టిడిపికి 59, జనసేనకు నాలుగు అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. వైసిపికి 18 నుంచి 21 లోక్సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టిడిపికి నాలుగు నుంచి ఆరు సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.
ఆరా సర్వేలో వైసిపికి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టిడిపికి 47, జనసేన పార్టీకి రెండు స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.
బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ వస్తుందని న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో ఎన్డీయేకు 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 118 నుంచి 120 సీట్లు, ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని పేర్కొంది.
ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ సర్వేలో వైసిపికి తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సర్వేలో వైసిపికి 18 నుంచి 20 లోక్సభ స్థానాలు వస్తాయని, టిడిపికి నాలుగు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని, ఇతరులకు సీట్లేమీ రావని అంచనా వేసింది.
ఏపీలో వైసిపి ప్రభంజనం ఖాయమని సిపిఎస్ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసిపి 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టిడిపి కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సిపిఎస్ సర్వే వెల్లడించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని పేర్కొంది. వైసిపికి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టిడిపికి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సిపిఎస్ వెల్లడించింది.
టైమ్స్నౌ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, ఎన్డీయేకు 306 సీట్లు, యూపిఏకు 132 సీట్లు, ఇతరులకు 104 సీట్లు వస్తాయని పేర్కొంది.
ఇదిలావుండగా లగడపాటి తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు పది అటో ఇటో స్థానాలు వస్తాయని వెల్లడించారు. వైకాపాకు 72కు 7 సీట్లు అటో ఇటో వస్తాయని తెలిపారు. జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు సీట్లు అటూఇటుగా వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రెండు పార్టీల మధ్య ఉంటుందని అన్నారు. తెదేపాకు ఇంచుమించు 43 శాతం ఓట్లు వస్తాయని, వైకాపాకు 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఓట్ల శాతంలో ఒక శాతం అటూఇటుగా ఉంటుందని చెప్పారు. ఏపీలో లోక్సభ స్థానాలపై మాట్లాడుతూ.. తెదేపాకు రెండు అటు ఇటుగా 15లోక్సభ స్థానాలు వస్తాయన్నారు. వైకాపాకు రెండు అటుఇటుగా 10 స్థానాలు రావొచ్చని అంచనావేశారు. జనసేనకు సున్నా నుంచి ఒక లోక్సభ స్థానం వచ్చే అవకాశం ఉందన్నారు