(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారీగా భద్రతా సిబ్బందిని జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలించారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం సాధరణ పరిస్థితి నెలకొనడంతో భద్రత బలగాలను కేంద్రం ఉపసంహరించుకుంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో శాంతిభద్రతలపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదే వేల పారామిలటరీ దళాలను కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించింది.
ఈశాన్య రాష్ట్రాల్లో వేలాది మంది నిరసనకారులు రోడ్డెక్కడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది. నిరసనకారుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. అయినప్పటికీ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో కేంద్రం పారా మిలటరీ దళాలను మోహరించింది. అసోంలోని కొన్ని చోట ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అక్కడ భారీగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. గౌహతిలో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఈ ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా వేలమంది భద్రతా సిబ్బందిని కశ్మీర్ కు తరలించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని రెండు రోజుల క్రితం పార్లమెంట్ వేదికగా కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే కేంద్రం తాజాగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే పారామిలటరీ దళాలను అక్కడికి తరలించారు.