Photo Credit: Indian Express
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆస్ట్రేలియాలో దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయాన్నే దినపత్రికల పాఠకులకు ఎన్నడూ ఎరుగని అనుభవం ఎదురయింది. పత్రిక చేతిలోకి తీసుకునే సరికి మొదటి పేజీలో చదవడానికి ఏమీ లేదు. పేజీ మొత్తం బ్లాక్అవుట్ అయిఉంది. ఇది ఆస్ట్రేలియా పత్రికలు స్వయంగా విధించుకున్న సెన్సార్షిప్. ఇందుకు కారణం ప్రభుత్వ విధానాల పట్ల నిరసన.
దినపత్రికలు, న్యూస్ ఛానళ్లు, రేడియో, ఆన్లైన్ పోర్టళ్లు కలిసి రైట్ టు నో అనే సంఘటనగా ఏర్పడి ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దినపత్రికల నిరసన తర్వాత సాయంత్రం న్యూస్ ఛానళ్లు ప్రైమ్ టైమ్ ప్రోగ్రాంలు రద్దు చేసి బ్లాకౌట్ పాటించాయి. ఆస్ట్రేలియన్, ద డైలీ టెలిగ్రాఫ్ పత్రికలు ప్రచురించే న్యూస్ కోర్ ఆస్ట్రేలియా, ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్ వంటి పత్రికలు ప్రచురించే నైన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కూడా ఈ నిరసనలో పాలు పంచుకున్నాయి.
జాతీయ భద్రతా కారణాలతో గత రెండు దశాబ్దాలుగా ఆస్ట్రేలియా ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేస్తున్నాయనీ, ఫలితంగా జర్నలిజం కష్టమైపోయిందనీ మీడియా పేర్కొంటున్నది. ఈ చట్టాలు పరిశోధనాత్మక జర్నలిజానికి అడ్డంకిగా మారడమే కాకుండా దానిని నేరంగా కూడా మారుస్తున్నాయని మీడియా అంటున్నది.
గత జూన్ నెలలో ఫెడరల్ పోలీసులు న్యూస్ కోర్ ఆస్ట్రేలియాలో పని చేసే రిపోర్టర్ యానికా స్మెథస్ట్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆమె చేసిన నేరం ఏమంటే ఆస్ట్రేలియా ప్రజలపై నిఘా పెట్టగలిగే ఒక రహస్య ప్రభుత్వ కార్యక్రమంపై పరిశోధనకు ఉపక్రమించడం.
గత సంవత్సరం ప్రభుత్వం తీసుకువచ్చిన గూఢచర్య వ్యతిరేక చట్టం నుంచి జర్నలిస్టులకూ, ప్రజావేగులకూ మినహాయింపు ఇవ్వాలన్నది రైట్ టు నో ప్రధాన డిమాండ్. ఆ చట్టం తమకు కూడా వర్తించినంత కాలం పరిశోధనాత్మక జర్నలిజం సాధ్యం కాదనీ, ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత గోప్య ప్రజాస్వామ్యంగా మారుతుందనీ ఎబిసి మానేజంగ్ డైరక్టర్ డేవిడ్ యాండర్సన్ వ్యాఖ్యానించారు.
మీడియా స్వేచ్ఛ ప్రాధాన్యత తమకూ తెలుసుననీ, అయితే చట్టబద్ధ పాలనకు మినహాయింపులు ఇవ్వడం కుదరదనీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అంటున్నారు.