(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వేచి చూసినప్పటికీ అమిత్షా అపాయింట్మెంట్ లభించలేదు. పలు కారణాల వల్ల అమిత్షా.. సీఎం జగన్కు అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో జగన్-అమిత్ షాల భేటీ మంగళవారానికి వాయిదా పడింది. అయితే, సోమవారం సాయంత్రం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో అమిత్షా తన కార్యాలయంలో భేటీ అయ్యారు. కానీ, జగన్కు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు ఆసక్తికర వార్తలు తెర మీదకు వస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావాలనే జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏపీ సీఎం ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు హస్తిన బాట పట్టారని వైసిపి వర్గాలు చెబుతున్నప్పటికీ… ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఢిల్లీ పర్యటణ వెనుక సొంత అజెండా ఉందని సమాచారం. అయితే దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు.
ముఖ్యమంత్రి జగన్కు అమిత్షా సమయం ఇవ్వకపోవడానికి ఢిల్లీలోని బీజేపీ వర్గాలు పలు కారణాలు చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుతోపాటు సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)విషయంలో కేంద్రం అభిమతానికి భిన్నంగా జగన్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ అంశాల్లో కేంద్ర వద్దని చెప్పినా, నష్టం జరుగుతుందని స్పష్టంగా వివరించినా పట్టించుకోవడం లేదు. దీంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒకింత ఘర్షణ వైఖరి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగన్ తన వ్యక్తిగత అజెండా కోసమే కేంద్ర హోంమంత్రిని కలవాలనుకుంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కోర్టుకు హాజరయ్యే విషయంలో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే దీనికి సీబీఐ మాత్రం ససేమిరా అంటోంది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మినహాయింపు లభించబోదని సీబీఐ స్పష్టం చేసింది. జగన్కు మినహాయింపు ఇస్తే, సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. అయితే దీనిపై జగన్ మాత్రం కోర్టు వాయిదాలతో తన అధికారిక కార్యక్రమాలకు అడ్డంకి ఏర్పడుతుందని అందుకే తనకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, దీనిపై సీబీఐ మాత్రం పట్టు వదలడం లేదు. దీంతో సీబీఐ, కోర్టు కేసుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రిగా అమిత్ షాతో కలిసి చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు జగన్.. కేంద్ర హోంమంత్రితో పాటు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తోనూ సీఎం భేటీకానున్నారు. కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై జగన్ పార్టీ ఎంపీలతో చర్చించారు.మరి ఈరోజైనా అమిత్ షా జగన్ కి అపాయింట్ మెంట్ ఇస్తారో లేదో చూడాలి.