కుక్క పిల్లా,
అగ్గి పుల్లా,
సబ్బు బిళ్ళా
హీనమ్గా ఛూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ! అన్నారు మహా కవి శ్రీ శ్రీ. అదే మాదిరిగా క్రికెట్, ఎన్నికల ఫలితాలు మొదలుకొని కోర్ట్ తీర్పుల వరకు అన్నీ బెట్టింగ్ లకు పాల్పడవచ్చు అంటున్నది నేటి సమాజం.
కోడి పందాలు, క్రికెట్ బెట్టింగులు చూశాము, ఎన్నికల ఫలితాలపైనా బెట్టింగులు చూశాము. ఇప్పుడు తాజాగా ఉత్కంఠ రేపుతున్న వ్యాజ్యంలో హైకోర్టు తీర్పుపైనా బెట్టింగ్ లు జరుగుతుండటం చూస్తున్నాం.
ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. గత నెలలో నిమ్మగడ్డను ఎస్ఈసీగా తొలగిస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయింది. ఇందులో నిమ్మగడ్డతో సహా ఇతర పిటిషనర్ల వాదనలు పూర్తి అయ్యాయి. ఇది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి.
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు పిటిషన్పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుధీర్ఘంగా విచారించిన అనంతరం నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఐదు రోజుల పాటు వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని 243 కే అధికరణలో పదవీ కాలం రక్షణ ప్రస్తావన లేదని ఏజీ వాదించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని.. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదనీ స్పష్టం చేస్తూ ఆర్డినెన్స్పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణార్హం కాదని ఏజీ కోర్టుకు తెలిపారు. అదే విధంగా ఎస్ఈసీగా ఉండే వ్యక్తి వయసు గురించి ప్రశ్నించడం సరికాదని అన్నారు. ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్.ప్రసాద్ వాదనలు వినిపించారు. మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్గా నియమించడం శుభపరిణామమని ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. ఎన్నికల కమిషన్ తరుఫున రాతపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు మాజీ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్ రెడ్డి సమయం కోరగా, వచ్చే సోమవారం వరకు హైకోర్టు సమయం ఇస్తూ తీర్పు రిజర్వ్ లో ఉంచింది.
రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రంగా కూడా చెప్పకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు పక్కా వ్యహంతో ముందడుగు వేసింది జగన్ ప్రభుత్వం. ఆర్డినెన్స్ తీసుకురావడం, కేబినెట్, గవర్నర్ ఆమోద ముద్రలు ఇలా ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నది. అయితే ఈ ఆర్డినెన్స్ ను నిమ్మగడ్డ హైకోర్టులో సవాలు చేయగా ప్రభుత్వం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ కేసులో విచారణ సమయంలో కోర్టు వ్యక్తం చేసిన అనుమానాలు, చేసిన వ్యాఖ్యలు పిటిషనర్లతో పాటు రాజకీయ నేతల్లో సైతం ఉత్కంఠ పెంచింది. అదే సమయంలో ఈ కేసు విచారణ సాగుతుండగానే.. కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ వ్యవహారంలో ఆయనను దోషిగా నిలిపేందుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయగా సీఐడీ వ్యూహాత్మకంగా దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు కూడా వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది.
ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏ విధంగా వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పు రాష్ట్రంలో రాజకీయ సంచలనం కల్గించే అవకాశం ఉందని భావిస్తున్న నేతలు బెట్టింగ్ లకు తెరలేపారు. రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో నిమ్మగడ్డ కేసు తీర్పుపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు- విజయవాడ రహదారిపై ఉన్న ఓ ప్రముఖ క్లబ్ లో మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు నిమ్మగడ్డ కేసు తీర్పుపై బెట్టింగ్ లు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో కూడా రహస్యంగా బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం.