బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా బిఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రి పదవిని యడ్యూరప్ప అధిష్టించడం ఇది నాలుగవసారి. గవర్నర్ వజూభాయ్ వాలా రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం 76 ఏళ్ల యడియూరప్పతో ప్రమాణస్వీకారం చేయించారు. అపవిత్ర కార్యంగా దీనిని అభివర్ణించిన కాంగ్రెస్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించింది.
ఈరోజు యడియూరప్ప ఒక్కరే పదవీ ప్రమాణం చేశారు. బలపరీక్షలో నెగ్గిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే సోమవారం ఆయన శాసనసభలో బలపరీక్షకు నుంచుంటారు. 14 నెలల కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విఫలమైన తర్వాత మూడు రోజులకు యడియూరప్ప ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.
స్పీకర్ రమేష్ కుమార్ ముగ్గురు తిరుగుబాటు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయడంతో కర్నాటక శాసనసభలో సభ్యుల సంఖ్య 222 కు తగ్గింది. ఇప్పుడు యడియూరప్ప బలపరీక్షలో నెగ్గాలంటే 112 మంది సభ్యులమద్దతు కావాలి. బిజిపికి సభలో ఉన్న సభ్యుల సంఖ్య 105 కాబట్టి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. ఒక ఇండిపెంటెంట్ సభ్యుడి మద్దతు ఇప్పటికే ఉంది. తిరుగుబాటు శాససభ్యుల మద్దతు దొరుకుతుందన్న నమ్మకం ఉంది. అందుకే 101 శాతం బలపరీక్షలో 101 శాతం నెగ్గుతానని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.
షిమోగా జిల్లాలోని షికార్పురా నియోజకవర్గం నుంచి యడియూరప్ప ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.