క్రైస్ట్చర్చ్ (న్యూజిలాండ్): అబ్దుల్ అజీజ్ అడ్డుకోకపోయి ఉంటే క్రైస్ట్చర్చ్ నరమేధం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువయేది. రెండు మసీదుల్లో మొన్న శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50మందిని చంపిన ఫాసిస్టు బ్రెంటన్ టారంట్ రెండవ మసీదుకు వెళ్లినపుడు అక్కడ అజీజ్ తన నలుగురు పిల్లలతో ప్రార్ధన చేస్తున్నాడు.
కాల్పుల శబ్దం వినగానే అజీజ్ చేతికందిన క్రెడిట్ కార్డు మెషిన్ పట్టుకుని బయటకు పరిగెత్తాడు. బయట టారెంట్ కనబడగానే అతనిపై ఆ మెషిన్ విసిరేశాడు. అది తగలగానే టారెంట్ అజీజ్పై కాల్పులు ప్రారంభించాడు. కార్ల మధ్య నక్కిన అజీజ్ తప్పిచుకున్నాడు. బుల్లెట్లు అయిపోయిన తుపాకిని కిందపడేసిన టారంట్ రెండవ తుపాకీతో కాల్పులు జరుపుతూ పక్కకు వెళ్లగానే అజీజ్ ఆ తుపాకీ తీసుకుని టారెంట్ మీదకు వెళ్లాడు. టారెంట్ భయపడి కారెక్కాడు. అజీజ్ వెంటపడి తుపాకితో కారు అద్దం పగలగొట్టాడు. టారెంట్ పారిపోయాడు.
మొదటి మసీదు దగ్గర 42 మంది చనిపోగా ఈ రెండవ మసీదు దగ్గర టారంట్ కాల్పులకు ఎనిమిది మంది బలయ్యారు. ప్రాణాలకు లెక్క చేయకుండా అజీజ్ అడ్డుకోకపోయి ఉంటే మరింతమంది చనిపోయి ఉండేవారు. ఇప్పుడతనిని హీరోగా కీర్తిస్తున్నారు. అజీజ్ మాత్రం దేవుడే రక్షించాడంటున్నాడు. ఆప్ఘనిస్తాన్కు చెందిన అజీజ్ ఆస్ట్రేలియా నుంచి రెండేళ్ల క్రితం న్యూజిలాండ్ వలస వచ్చాడు. ఆక్కడ జాత్యహంకారం పెరిగిపోవడంతో ఇక్కడకు వచ్చానని అతను చెప్పాడు.