విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి హైపవర్ కమిటీ నివేదిక అందిన 24 గంటల వ్యవధిలోనే యాజమాన్యంతో సహా అందుకు బాద్యులైన 12 మందిని అరెస్ట్ చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై ఇప్పటి వరకు కొందరికి ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ప్రమాద ఘటన జరిగిన తరువాత బాధితులను పరామర్శించడానికి వెళ్లిన విశాఖ వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా యాజమాన్య ప్రతినిధులతో సమావేశం కావడంతో పాటు యాజమాన్యం ఎంత ఇచ్చినా ఇవ్వకున్నా ప్రభుత్వం ఒక్కొక్క మృతుల కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు. దీనితో సీఎం జగన్ .. కంపెనీ ప్రతినిధులను వెనుకేసుకు వస్తున్నారంటూ ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురు అయ్యాయి.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం నేపథ్యంలో సంస్ధకు చెందిన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ సంస్థ యాజమాన్యం గత నెల హైకోర్టు ను ఆశ్రయించిన సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించగా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఎల్జీ పొలిమార్స్ తమ ఉత్పత్తులను మార్కెట్ లో విక్రయించు కోవడానికి అనుమతి ఇవ్వవచ్చని సూచించింది. దీనితో తొలి నుండి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శలు పటాపంచలు చేస్తూ యాజమాన్యం అరెస్ట్ లో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు సంచలనాత్మకం అయ్యింది. హై పవర్ కమిటీ నివేదిక సీఎం జగన్ కు అందిన మరుసటి రోజే 12 మందిని అరెస్ట్ చేయడంతో పాటు ఇద్దరు విశాఖ పర్యావరణ ఇంజినీర్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ ఘటనతో తప్పు జరిగినట్లు రుజువు అయితే ఎంతటి వారినైనా జగన్ ప్రభుత్వం ఉపేక్షించదు అని స్పష్టత వచ్చినట్లు అయ్యింది.