లండన్: భారత సంతతికి చెందిన వైద్యురాలు ఒకరు యూకేలో అదృశ్యం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనెల మూడో తేదీన హెరెఫోర్డ్ షైర్ ప్రాంతంలోని తన ఇంటి నుంచి డాక్టర్ ఉమా కులకర్ణి అదృశ్యం అయ్యారు. 42 ఏళ్ల ఉమ.. నాగపూర్ యూనివర్సిటీ నుంచి 1999లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. యునైటెడ్ కింగ్ డమ్ లో 2015 సంవత్సరంలో జనరల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని అప్పటినుంచి అక్కడే వైద్యవృత్తిలో ఉన్నారు. తన ఇంటి నుంచి ఆమె బ్రిస్టల్ ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.
ఎవాన్ ప్రాంతానికి ఆమె ప్రయాణించి ఉండచ్చని, ఆమె కారు సెవెర్న్ బ్రిడ్జి క్రాసింగ్ వద్ద కనిపించడంతో.. బహుశా ఎవాన్, సోమర్సెట్ ఫోర్స్ ఏరియాలకు ఆమె వెళ్లి ఉండచ్చని సోమర్సెట్ పోలీసులు తెలిపారు. డాక్టర్ ఉమా కులకర్ణి 5 అడుగుల ఎత్తు, సన్నగా నల్లటి జుట్టుతో ఉంటారని, రెండు చెవులు కుట్టించుకున్నారని అన్నారు. ఆమె సాధారణంగా చెవికి రింగులు ధరిస్తారని, అయితే అదృశ్యం అయ్యే సమయానికి ఏం పెట్టుకున్నారో తెలియదని చెప్పారు.
ఇంగ్లండ్ – వేల్స్ సరిహద్దు ప్రాంతమైన సెవెర్న్ బ్రిడ్జి సమీపంలో ఆమె ఆచూకీ గురించి పోలీసులు విచారణ జరిపారు. ఇంతవరకు ఆమె ఎవరికీ ఫోనులో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లండ్ లో స్థానికుల తర్వాత అత్యధిక సంఖ్యలో భారతీయ వైద్యులే నేషనల్ హెల్త్ సర్వీసులో ఉంటారు.