తేజస్విపై తేజ్ ప్రతాప్ విసుర్లు
బెదిరింపులు పనిచేయని వైనం
పట్నా: తాను చెప్పిన ఇద్దరికీ టికెట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో అంటూ.. తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన బెదిరింపులు ఏవీ ఫలించలేదు. ఆర్జేడీ పార్టీ నాయకత్వం ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో తన సోదరుడు, పార్టీ నాయకుడు తేజస్వి యాదవ్ పేరు ప్ర్తస్తావించకుండానే.. అతడిని దుర్యోధనుడితో పోలుస్తూ విసుర్లు వేశారు. శివోహర్ స్థానం నుంచి అంగేష్ సింగ్ అనే వ్యక్తిని నిలబెట్టాలని తేజ్ ప్రతాప్ కోరుతుంటే, ఆర్జేడీ మాత్రం సయ్యద్ ఫసల్ అలీని అభ్యర్థిగా నిర్ణయించింది. ఎన్డీయేపై చేసే యుద్ధంలో సోదరుడు తేజస్వి అర్జునుడైతే తాను అతడికి కృష్ణుడిలా రథసారథి అవుతానని ఇంతకుముందు పలు సందర్భాలలో తేజ్ ప్రతాప్ చెప్పేవాడు. కానీ ఉన్నట్టుండి దాన్ని మార్చేసి, తమ్ముడిని కాస్తా అన్నను చేసి దుర్యోధనుడని పిలిచాడు. పాండవులకు కనీసం ఐదు ఊళ్లు ఇవ్వకపోవడం వల్లే మహాభారత యుద్ధం వచ్చిన సంగతి తెలిసిందే.
తొలుత ఐదు స్థానాలు తమవాళ్లకు ఇవ్వాలన్న తేజ్ ప్రతాప్, చివరకు కనీసం రెండయినా పర్వాలేదన్నాడు. అవి శివోహర్, జెహానాబాద్. అలాగే సరణ్ స్థానంలో తన మామ చంద్రికారాయ్ అభ్యర్థి కావడం కూడా తేజ్ ప్రతాప్ కు ఇష్టం లేదు. అక్కడ తమ తల్లి రబ్రీదేవిని నిలబెట్టాలని, సంప్రదాయంగా అది తమ కుటుంబానికే చెందాలని పట్టుబట్టాడు. తన భార్య ఐశ్వర్యా రాయ్ తో విడాకులు తీసుకోవాలని అతడు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచే లాలు పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ తో కుటుంబ విభేదాలు మొదలయ్యాయి.
తమ్ముడిపై ఒత్తిడి పెంచడానికి అతడు లాలు-రబ్రీ మోర్చాను స్థాపించాడు. రెండు రోజుల్లోగా తన మాట వినకపోతే తాను స్వతంత్రుడిగా సరణ్ స్థానంలో పోటీ చేయడంతో పాటు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కనీసం ఐదు చోట్ల తనవాళ్లను నిలబెడతానన్నారు. దాంతో తన సోదరుడిపై విమర్శలకు రాంధారీ సింగ్ దినకర్ రాసిన పద్యాన్ని అందుకున్నాడు. ‘‘దుర్యోధన్ వహ్ భీ దే న సకా.. ఉల్టే హరి కో బాంధనే చలా.. జబ్ నాశ్ మనుజ్ పర్ చటా హై, పహలే వివేక్ మర్ జాతా హై’ అని ట్వీట్ చేశాడు. ‘‘దుర్యోధనుడు ఐదు ఊళ్లు కూడా ఇవ్వలేకపోగా, కృష్ణుడిని బంధించాలనుకున్నాడని, మనిషికి నాశనం సమీపించినపుడు తొలుత వివేకం పోతుంది’’ అని దానికి అర్థం. ఈ నెల 24న తేజ్ ప్రతాప్ మద్దతుతో చంద్రప్రకాష్ జెహానాబాద్ లో నామినేషన్ దాఖలుచేయనున్నారు.