పాపం అమెరికా…! ఆర్ధిక, సాంకేతిక, సైన్స్ రంగాలకు పెద్దన్న అమెరికా. అందుకే ఆ దేశాన్ని అగ్రరాజ్యం అంటుంటారు. మరి ఇప్పుడు ఆ అగ్రరాజ్యం అల్లాడుతుంది. కరోనా ధాటికి కోలుకోలేక విలవిల్లాడుతుంది. ఏం చేయాలో తెలియక, పరిష్కారం కనుగొనలేక ట్రంప్ నానా యాతన పడుతున్నారు. అన్నిటినీ మించి ఆ దేశానికి ఇప్పుడు ఆర్ధిక సంకట స్థితి మరింత క్లిష్టం లోకి నెట్టేసాయి. ఈస్టర్ నాటికి పూర్తిగా కోలుకుని చర్చిలకు వేలాదిగా ప్రజలు చేరుకుని ప్రార్ధనలు చేసుకోవాలని ట్రంప్ అభిలాషిస్తున్నారు. అంటే ఏప్రిల్ 12 నాటికి కరోనను మొత్తం దేశం నుండి వెల్లగొట్టేయాలనేది ఆయన అభిమతం. మరి అది సాధ్యమేనా? ప్రస్తుతం అమెరికా ఏ దశలో ఉంది? న్యూ యార్క్ ఎందుకు అంతగా అల్లాడుతుంది? అనేది చూద్దాం.
సగం కేసులు న్యూయార్క్ లోనే…!
అమెరికాలో కరోనా చాపకిందనీరులా విస్తరించింది. మొదట అంత సీరియస్ గా తీసుకొని ట్రంప్… క్రమేణా దానిపై భయం పెంచుకున్నారు. ప్రస్తుతం నిస్చేష్టులై చూస్తున్నారు. ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. దేశం మొత్తం 60 వేల మంది కరోనా రోగులు ఉంటే, ఒక్క న్యూయార్క్ నగరంలోనే 30 వేల మంది ఉన్నారు. అమెరికాకు న్యూ యార్క్ నగరం గుండెకాయ. ఆర్ధిక, సాంకేతిక సారథి ఆ నగరమే. విదేశాల నుండి రాకపోకలు, సాఫ్ట్ వేర్ తయారీ సంస్థలు, సాంకేతిక, వైద్య నిపుణులు కొలువుండేది న్యూయార్క్ లోనే. అటువంటి నగరం ఇప్పుడు విలపిస్తుంది. మొత్తం లాక్ డౌన్ లో ఉన్నాయి. దేశమంతటా ఇళ్లకే పరిమితమయ్యారు. 14 రోజులుగా కొనసాగుతుండగా, ఎప్పటి వరకు అనేది స్పష్టత రాలేదు. లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ ఆ దేశంలో రోజుకి సగటున 2 వేల కొత్త కేసులు బయటపడుతుండడం…, రోజుకి సగటున ఇరవై మంది మరనిస్తుండడం ఆ దేశానికి ఊపిరి సలపడం లేదు. మొత్తం మీద ఇప్పటి వరకు 920 మంది మరణించారు. మరో 2100 మంది ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో ఉన్నారు. లాక్ డౌన్ కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం సోధనలు చేయిస్తూనే, భయం గుప్పిట వణుకుతున్నారు.
ఆర్ధిక ప్యాకేజీకి కసరత్తులు…!
అమెరికాలో ప్రస్తుతం ఉత్పత్తులు లేవు. ఎగుమతులు లేవు. ఆ దేశానికి అత్యధిక ఆదాయ వనరుగా ఉన్న ఫార్మా, సాఫ్ట్ వెర్ రంగం మూతబడింది. అందుకే దేశంలో ఆర్థిక కష్టాలు బాగా పెరిగాయి. నిజానికి అమెరికా గడిచిన ఏడాది కాలంగా ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తాజాగా కరోనతో ఆ దేశానికి పెద్ద దెబ్బ పడింది. లాక్ డౌన్ కారణంగా అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఆర్ధికంగా చాలా నష్టం జరిగింది. అందుకే ప్రజలకు రూ. 20 వేల కోట్ల డాలర్లు ప్యాకేజి ప్రకటించే యోచనలో ట్రంప్ ఉన్నారు. అయితే ఈ ప్యాకేజి ఏ మాత్రం ఉపశమనం ఇవ్వదు. కనీసం 50 వేల కోట్ల డాలర్లు ఇవ్వనిదే మధ్యతరగతి జీవులకు గడవదని అక్కడి నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటు చైనా కరోనా నుండి క్రమేణా కోలుకుని సాధారణ జీవనంలోకి వస్తుండగా, అటు అమెరికా అల్లాడుతుంది. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతే ప్రపంచంలో ఆర్ధికంగా ఎక్కువ దెబ్బ తినే దేశం అమెరికనే అవుతుంది.