విజయవాడ, ఏప్రిల్ 5: ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నరేంద్ర మోది గెలిస్తే భవిష్యత్లో అసలు ఎన్నికలు ఉంటాయా అనే అనుమానాలున్నాయని సుధాకరరెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్,బిజెపి భావజాలంతో చేసిన పాలన ఐదేళ్లు చూసాము, రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి సగం కూడా సృష్టించలేకపోయారని సుధాకరరెడ్డి ఆరోపించారు. ఆర్ధిక విధానాలు పెట్రోల్, డీజల్,నిత్యావసర ధరల నియంత్రణ చేయలేకపోయారని విమర్శించారు.
అంబానీ,అదాని వంటి కొంత మందికే లబ్ది చేకూరే విధానాలు తీసుకు వచ్చారని సుధాకరరెడ్డి అన్నారు. గోరక్షణ పేరుతో దళితులపై దాడులు, రిజర్వేషన్లకై పోరాడిన దళితులపై కేసులు పెట్టారని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 15 నియోజకవర్గాల్లో టిడపి అసెంబ్లీ అభ్యర్థులపై దాడులు చేయడం చూస్తునే ఉన్నామని సుధాకరరెడ్డి అన్నారు. ప్రతిపక్షాలన్నీ దేశ ద్రోహులనీ,హిందు వ్యతిరేకులనీ స్వయంగా ప్రధాని ప్రచారం చేస్తున్నారని సుధాకరరెడ్డి విమర్శించారు.
పుల్వామా దాడుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంనేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు అవగాహన లేకుండా అసాధ్యమనీ,ముందు అవగాహన కలిగి ఉండాలని సుధాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. 40 పార్టీలతో బిజెపి ఫ్రంట్ పెట్టినప్పుడు 23 పార్టీలతో ఫ్రంట్ ఎందుకు సాధ్యం కాదని సుధాకరరెడ్డి ప్రశ్నించారు. కొన్ని పార్టీలు అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రయత్నించకపోవడం జరుగుతోందని అన్నారు.
వయనాడ్లో రాహుల్ గాంధీ వామపక్ష పార్టీకి ఎదురు పోటీ చేయడం ఒక తప్పుడు సంకేతం వెళుతుందని సుధాకరరెడ్డి అన్నారు.
బిజెపికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఒక ప్లాట్ఫారం తీసుకు వచ్చిందని సుధాకరరెడ్డి పేర్కొన్నారు. తక్కువ సీట్లు ఉన్నా పార్టీలు అధికారంలో భాగస్వామి కావాలని చూస్తున్నాయని అన్నారు. ‘మేము ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము,అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం’ అని సుధాకరరెడ్డి అన్నారు.
యుపిఎ హయాంలో ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షానికి మద్దతిచ్చామని గుర్తు చేశారు. మతోన్మాద పార్టీని అధికారంలో నుండి తొలగించాల్సిన అవసరం ఉందనీ, సెక్యూలర్ ప్రభుత్వ ఏర్పాటు వంటివి ప్రధాన అంశాలతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని సుధాకరరెడ్డి వెల్లడించారు.