అమరావతి: ఉండవల్లి సమీపంలోని కృష్ణానదీ కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజావేదిక తొలగింపుతోనే అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో మూడు రోజుల క్రితం సిఆర్డిఎ అధికారులు ప్రజావేదికను కూల్చివేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేస్స్కు కూడా నోటీసు జారీ చేసింది. తాజాగా శనివారం మరో పది మందికి సిఆర్డిఎ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో లింగమనేని రమేష్, నరసాపురం మాజీ ఎంపి గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్, తులసీ గార్డెన్స్, పాతూరి సుధారాణి, శైవ క్షేత్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న కట్టడాలన్నింటికీ నోటీసులు ఇస్తామని చెప్పారు. అయితే కొందరు తమ నిర్మాణాలకు హుడా పర్మిషన్లు, ప్లాన్ అప్రూవల్, ఇంటి పన్ను రసీదులు ఉన్నాయంటూ వాటిని సిఆర్డిఎ అధికారులకు చూపుతున్నారు. వారి నివాసాల ముందు తమ భవనానికి అనుమతులు అన్నాయంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. శివరామకృష్ణ గార్డెన్స్కు సిఆర్డిఎ అధికారి ఒకరు నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా అతని వద్ద ఉన్న హుడా అనుమతి పత్రాలు చూపడంతో అనుమతి నెంబర్లు రాసుకొని విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి నోటీసు ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
previous post
next post