(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: మొబైల్ ఫోన్ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా దేశంలో మొబైల్ డేటా వాడకం భారీగా పెరుగుతోంది. ప్రజల దైనందిన జీవితంలో సెల్ ఫోన్లు ముఖ్యమైన ఉపకరణంగా నేడు మారాయి. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొబైల్లో ముచ్చట్ల కంటే నచ్చిన వీడియోలను తిలకించేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇతర ప్రాంతీయ భాషల వీడియోల కంటే తెలుగు వీడియోల వీక్షకుల సంఖ్య ప్రధమ స్థానంలో ఉంది.
రిలయన్స్ జియో రాకతో దేశంలో డేటా వినియోగం భారీగా పెరిగినట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. డేటా ధరలు చౌకగా మారడంతో 2016లో నెలకు సగటున 20 కోట్ల జిబిగా ఉన్న డేటా వినియోగం 2018 నాటికి ఏకంగా 370 కోట్ల జిబికి చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 5491 కోట్ల జీబీ డేటాను వినియోగించినట్లు టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి మొబైల్ వినియోగదారుడు రోజుకు సగటున 67 నిమిషాలు వీడియోలు చూడటానికి సమయం కేటాయిస్తున్నట్లు ఓ అధ్యయన సంస్థ వెల్లడించింది. 2012లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే వీడియోలు చూసేందుకు సమయం కేటాయించగా ఇప్పుడు రోజుకు ఏకంగా గంటకుపైగా వీడియోలను చూస్తున్నట్లు యాప్ అన్నే సంస్థ తెలిపింది. వీడియోలను చూసేందుకు అత్యధికంగా యూట్యూబ్ను అనుసరిస్తుండగా ఆ తర్వాత స్థానాల్లో హాట్ స్టార్, జియో టీవి, ప్రైమ్ వీడియో యాప్స్ ఉన్నాయి.
హిందీయేతర వీడియోల విషయానికి వస్తే తెలుగు వీడియోలకు అత్యధిక డిమాండ్ ఉన్నట్లు విడోలి సంస్థ తన సర్వే నివేదికలో వెల్లడించింది. తెలుగు వీడియోలకు అత్యధిక వీక్షకాదరణ ఉన్నట్లు తెలిపింది. యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే వీడియోల్లో కూడా తెలుగువే అత్యధికంగా ఉంటున్నాయి. 2016లో మొత్తం 1.6 కోట్ల తెలుగు వీడియోలు అప్లోడ్ కాగా 2018 నాటికి ఇది 16.6కోట్లకు దాటేసింది.
ప్రాంతీయ భాషల్లో 2018లో తెలుగు వీడియోలను 6,740 కోట్ల సార్లు వీక్షించడంతో మొదటి స్థానంలో నిలిచింది. 4,550 కోట్ల వ్యూస్తో తమిళ తంబి రెండవ స్థానంలో ఉండగా, 3,140 కోట్ల వీక్షకుల సంఖ్యతో మూడవ స్థానంలో భోజ్పురీయులు, 3,000 కోట్ల వీక్షకుల సంఖ్యతో పంజాబీలు నాల్గవ స్థానంలో, 1,990 కోట్ల వ్యూస్తో కేరళీయులు (మలయాళం) అయిదవ స్థానంలో ఉన్నట్లు విడోలి తెలిపింది. తెలుగులో న్యూస్ ఛానళ్లు, సినీరంగ విషయాలకు ఆదరణ లభిస్తున్నది. ఇక 5జి రంగ ప్రవేశం చేస్తే డేటా వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.