(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపిలో జాతీయ పార్టీ కాంగ్రెస్ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతున్నది. రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దీనిపై స్పందించలేదు. దీంతో ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? ఆ పార్టీ నాయకులు ఏమి చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. రాజధాని అమరావతి అంశంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం స్పందించగా కాంగ్రెస్ పార్టీనుంచి అధికారికంగా ఒక ప్రకటన రాలేదు. దీనికి కారణం పిసిసి అధ్యక్షుడి నియామకం ఇంతవరకూ జరగకపోవడం. ఫలితంగా ఇక్కడి పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు వివరించి వారితో ప్రకటన చేయించేవారు లేకుండాపోయారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మాత్రం అమరావతి రైతుల ఆందోళనకు సంఘీబావం తెలుపుతున్నారు.
విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహించి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేయగా ఆయన బాటలోనే ఇక్కడి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సాధారణ రైతుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న ఉమెన్ చాందీ ఇప్పటి వరకూ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నాయకులు ఇప్పటికీ కొందరు ఉన్నా నాయకత్వలేమి కారణంగా ప్రజాందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఉమెన్ చాందీ రాష్ట్రంలోని పలువురు ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించినప్పటికీ పిసిసి అధ్యక్షుడి నియామకంపై ఏకాభిప్రాయానికి రాలేదు.
కనుచూపు మేరలో పార్టీకి రాజకీయ భవిష్యత్తు కనిపించే పరిస్థితులు లేకపోవడంతో పిసిసి పీఠం అధిష్టించేందుకు మెజార్టీ నాయకులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. పార్టీకి నాయకత్వం వహించడానికి కాస్త పలుకుబడి, పరపతి ఉన్న వారు ఇష్టపడటం లేదు. కొద్ది మంది ఉత్సాహపడుతున్నా మిగిలిన వారు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. తొలుత కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుకు పిసిసి బాధ్యతలు అప్పగిస్తున్నారని వార్తలు వచ్చినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. తరువాత మాజీ ఎంపి చింతా మోహన్, మాజీ మంత్రి శైలజానాధ్తో పాటు మహిళా నేత సుంకర పద్మశ్రీ పిసిసి రేస్లో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.