(న్యూవేవ్స్ డెస్క్)
ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు జరిగే కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలకు ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా హాజరు కావడం లేదు. తాను అసమ్మతి తెలిపిన సందర్భాలలో తన అసమ్మతిని నమోదు చేయడం లేదు కాబట్టి తాను ఫుల్ కమిషన్ సమావేశాలకు హాజరు కావడం లేదని ఆయన ప్రధాని ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు మే నాలుగవ తేదీన లేఖ రాసినట్లు ఎన్డిటివి తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ అరోరాతో పాటు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. ఏకగ్రీవ నిర్ణయాలు అభిలషనీయమని ఎన్నికల సంఘం నియమావళి పేర్కొంటున్నది. ముగ్గురు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేనపుడు మెజారిటీ నిర్ణయం అమలు చేయవచ్చని నియమావళి సూచిస్తున్నది.
ఇప్పటివరకూ ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోదీకి ఆరు సందర్భాలలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదుల్లో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నిర్ణయాలలో కొన్నిటితో లావాసా విబేధించారు. గుజరాత్లో ఏప్రిల్ 21న మోదీ చేసిన ఒక ప్రసంగానికి సంబంధించి మే నాలుగున ఎన్నికల సంఘం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. పైలట్ అభినందన్ వర్ధమాన్ విడుదల కోసం పాకిస్థాన్ను ఎలా బెదిరించాలో అలా బెదిరించానని ఆ ప్రసంగాలో మోదీ పేర్కొన్నారు. అణుబాంబులు ఉన్నది ఎందుకు దీపావళి కోసమా అని ఆయన అన్నది కూడా ఆ సందర్భంలోనే.
మైనారిటీ నిర్ణయాలను నమోదు చేయడం లేదు కాబ్టటి తాను ఫుల్ కమిషన్ సమావేశాలలో పాల్గొనడం అర్ధరహితంగా మారిందని లావాసా తన లేఖలో పేర్కొన్నారు. మైనారిటీ నిర్ణయాలను రికార్డు చేసే విధంగా కమిషన్ చట్టబద్ధ పనితీరు కోసం తాను ఇతర మార్గాలు ఎంచుకునే అవకాశం ఉందని కూడా ఆయన తన లేఖలో రాశారు. ఈ లేఖ అందిన తర్వాత ప్రధాన కమిషనర్ లావాసాతో ఒకసారి భేటీ అయ్యారు. పాక్షిక జ్యుడీషియల్ నిర్ణయాల విషయంలోనే మైనారిటీ నిర్ణయం కూడా నమోదు చేస్తామనీ, కోడ్ ఉల్లఘనలలో కాదనీ అరోరా అంటున్నారు. మైనారిటీ నిర్ణయం నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తప్పించుకునేందుకు ఆయన కోడ్ ఉల్లంఘనలపై ఉత్తర్వులు జారీ చేయకుండా క్లీన్ చిట్ ఇస్తున్నారు.