చెన్నై: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిషృత నాయకురాలు శశికళకు చెందిన 1,600 కోట్ల రూపాయల ఆస్తులను బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఐటీ అధికారులు జప్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆమె భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో శశికళ కుటుంబ సభ్యులు చెన్నై, పుదుచ్చేరి, కోయంబత్తూరులో ఆస్తులను కూడబెట్టారన్న సమాచారంతో ఐటీ శాఖ దాడులు చేసినట్లు తెలుస్తోంది. శశికళకు చెందిన పది సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.
అక్రమాస్తుల కేసులో రెండేళ్లుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ‘చిన్నమ్మ’ శశికళ శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడు దివంగత సీఎం జయలలిత బతికి ఉన్నప్పుడు చిన్నమ్మగా శశికళ చక్రం తిప్పారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే మీద పట్టుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించినా.. ఆ తర్వాత పన్నీరు సెల్వం, పళనిస్వామి తిరుగుబాటు చేయడంతో శశికళ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే.