అమరావతి: రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో పాటే మంచి ఎత్తుకు ఎదిగిన కోడెల శివప్రసాదరావు వైద్యుడుగా కూడా మంచి పేరు ఉంది. పల్నాటి ప్రాంతంలో మంచి హస్తవాసి ఉన్న డాక్టర్గా ఆయనకు గుర్తింపు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా తీరికలేకుండా గడుపుతున్న రోజుల్లో కూడా నర్సరావుపేట వెళ్లి ఆయనే కొన్ని ఆపరేషన్లు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. కోడెల ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారన్న వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆయన ఒకే పార్టీలో కొనసాగారు. నవ్యాంధ్ర తొలి శాసనసభాపతి బాధ్యతలు నిర్వహించిన కోడెల 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన కొత్తలో గుంటూరు పర్యటనకు వచ్చిన ఎన్టి రామారావు కోడెలను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. వైద్య వృత్తిలో తీరికలేకుండా గడుపుతున్న ఆయనకు రాజకీయాల్లోకి రావడం తొలుత ఇష్టం లేకపోయినా పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టిఆర్యే స్వయంగా ఆహ్వనించడంతో ఒప్పుకున్నారు. 1983 ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999 వరకూ వరుసగా అయిదు సార్లు నరసరావుపేట నుండే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో పరాజయం పాలయ్యారు.
పల్నాడు ప్రాంతంలో గొప్ప రాజకీయ చరిత్ర కల్గిన కాసు కుటుంబాన్ని ఢీకొట్టిన నాయకుడిగా కోడెల శివప్రసాదరావుకు పేరు వచ్చింది. 1984,1999 ఎన్నికల్లో కాసు వెంకట కృష్ణారెడ్డిని ఓడించిన ఆయన 2004,2009 ఎన్నికల్లో కాసు చేతిలో ఓడిపోయారు. ఆయన అభిమానులు పల్నాటి పులిగా పిలుస్తుండే వారు.
ఎన్టిఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో ఆయన హోంశాఖ, నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాలు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు.
కోడెల మృతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు సంతాపం తెలియజేశారు.