వాషింగ్టన్: పాకిస్థాన్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ను సురక్షితంగా ఆ దేశానికి అప్పగించాలని రచయిత, పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఉదయం పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుచొని రావడంతో వాటిని తరిమికొట్టేందుకు భారత వాయుసేన విమానాలు బయల్దేరాయి.
ఈ క్రమంలో భారత్కు చెందిన మిగ్ 21బైసన్ నియంత్రణ రేఖ అవతల కూలిపోయింది. అయితే, ఈ విమానంలోని పైలట్ అభినందన్ వర్థమాన్ సురక్షితంగానే నేలపై దిగారు. గమనించిన పాక్ సైన్యం అతడ్ని అదుపులోకి తీసుకుంది.
‘నాతోపాటు అనేకమంది పాకిస్థాన్ యువత మన దేశ సైనికుల ఆధీనంలో ఉన్న భారత పైలట్ను సురక్షితంగా ఆ దేశానికి అప్పగించాలని కోరుకుంటున్నది. ఇలా చేస్తేనే శాంతి, మానత్వం, డిగ్నిటీకి మన దేశం కట్టుబడి ఉందనే సందేశం ఇచ్చినట్లవుతుంది’ అని ఫాతిమా భుట్టో న్యూయార్క్ టైమ్స్కి రాసిన కథనంలో పేర్కొన్నారు.
I and many other young Pakistanis have called upon our country to release the captured Indian pilot as a gesture of our commitment to peace, humanity and dignity. My piece in @nytimes https://t.co/Vmd7EWlDvX
— fatima bhutto (@fbhutto) February 27, 2019
‘మనం మన జీవితం మొత్తాన్ని యుద్ధానికే ఖర్చు చేస్తున్నాం. నేను పాకిస్థాన్ సైనికులు చనిపోవాలని కోరుకోవడం లేదు. అలాగే భారతీయ సైనికులు చనిపోవాలని కూడా కోరుకోవడం లేదు. మనం ఉపఖండంలో అనాథలుగా మిగలకూడదు’ అని ఈ పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మేనకోడలు స్పష్టం చేశారు.
‘నా తరం పాకిస్థానీలందరికీ మాట్లాడే హక్కు ఉంది. శాంతి స్థాపన కోసం మేము మా గొంతను వినిపించడానికి ఏమాత్రం భయపడం’ అని ముర్తజా భుట్టో కూతురైన ఫాతిమా వ్యాఖ్యానించారు. ‘మన దేశ చరిత్ర చూసుకున్నట్లయితే సైనిక నియంత్రణ, ఉగ్రవాదం, అనిశ్చితిలోనే సుదీర్ఘకాలతం కొనసాగింది. దీన్ని నేటి పాకిస్థానీ తరం ఏ మాత్రం సహించదు’ అని ఫాతిమా స్పష్టం చేశారు.
తనలాగే చాలామంది భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని కోరుకోవడం లేదని ఆమె అన్నారు. ‘తన పొరుగుదేశాలతో నా దేశం ఎప్పుడూ శాంతి వాతావరణాన్ని కొనసాగించగా చూడలేదు. రెండు అణ్వాయుధ దేశాలు ట్విట్టర్ వేదికగా యుద్ధం చేసుకోవడం కూడా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్లో #సేటునోవార్ అనే హాష్ట్యాగ్ ఇప్పుడు నెం. 1 స్థానంలో ఉండటం గమనార్హం.
ప్రస్తుతం పాకిస్థాన్లో ఆధీనంలో ఉన్న భారత పైలట్ అభినందన్ను తిరిగి క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది. వెంటనే తమ పైలట్ను సురక్షితంగా తమ దేశానికి పంపాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో పాక్ రాయబార కార్యాలయానికి సమన్లు పంపింది.