తిరువనంతపురం: ఇస్రో మాజీ అధిపతి మాధవన్ నాయర్ ను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపులు వచ్చాయి. దానిపై కేరళ పోలీసులు ముమ్మరంగా ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఆయనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాసినట్లు పోలీసులు చెప్పారు. దాంతో ఇండియన్ పీనల్ కోడ్ లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే, తనకు మాత్రం ఆ లేఖ గురించి ఏమీ తెలియదని మాధవన్ నాయర్ అంటున్నారు. కానీ తనకు బెదిరింపు ఉందన్న విషయం గురించి నిఘా వర్గాలకు సమాచారం ఉందని తనకు తెలిసిందన్నారు. 2009 సంవత్సరంలో ఇస్రో చైర్మన్ పదవి నుంచి రిటైర్ అయిన నాయర్.. గత సంవత్సరం అక్టోబరు నెలలో బీజేపీలో చేరారు. కానీ, ఆ తర్వాత కూడా ఆయన పార్టీ కార్యకలాపాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.