బాల్టిమోర్ (అమెరికా): వైద్య చరిత్రలో ఇదో మేలి మలుపు. స్వయంగా హెచ్ఐవీ పాజిటివ్ అయిన మహిళ కిడ్నీని.. మరో హెచ్ఐవీ పాజిటివ్ బాధితురాలికి అమర్చి అమెరికా వైద్యులు చరిత్ర సృష్టించారు. దీంతో హెచ్ఐవీ బాధితులకు అవయవ మార్పిడి విషయమై ఇన్నాళ్లూ ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్లయింది. నీనా మార్టినెజ్ (35) అనే మహిళ కిడ్నీ దానం చేయగా, గ్రహీత ఎవరన్న విషయం మాత్రం ఆసుపత్రి వర్గాలు బయటపెట్టలేదు. ఏడాది నుంచి డయాలసిస్ మీదే ఉంటున్న ఆ రోగికి ఇక అది అవసరం లేదని బాల్టిమోర్ లోని జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
జీవితం ఇవ్వగలను
సాధారణంగా తనలాంటి వాళ్లు మరణాన్ని తెస్తారని సమాజం అనుకుంటుందని, కానీ తాను కూడా జీవితం ఇవ్వగలనని చూపిస్తున్నానని ఆపరేషన్ చేయడానికి ముందు నీనా మార్టినెజ్ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు తెలిపారు. చిన్న వయసులో ఉండగానే రక్తమార్పిడి కారణంగా హెచ్ఐవీకి గురైన మార్టినెజ్.. ప్రపంచంలో తొలిసారిగా కిడ్నీ దానం చేసిన హెచ్ఐవీ బాధితురాలిగా చరిత్రకెక్కారు. తనకు ఇప్పుడంతా బాగానే ఉందని, అక్టోబరులో వాషింగ్టన్ లో జరిగే మెరైన్ కోర్ మారథాన్ లో పరుగు పెట్టేందుకు శిక్షణ కోసం సిద్ధమవుతున్నానని ఆమె చెప్పారు.
రక్తదానం కూడా చేయలేరు..
హెచ్ఐవీ ఉన్నవాళ్లు ఇన్నాళ్లూ రక్తదానం కూడా చేయలేరని, ఇపుడు ఏకంగా కిడ్నీ దానం చేసే పరిస్థితి వచ్చిందని జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రి సర్జరీ ప్రొఫెసర్ డారీ సెగెవ్ చెప్పారు. మార్టినెజ్ ఎడమ కిడ్నీ తీయడానికి చేసిన పరిశోధనకు ఆయనే నేతృత్వం వహించారు. 30 ఏళ్ల క్రితమైతే హెచ్ఐవీ అనేది మరణశాసనమని, కానీ ఇప్పుడు మరొకరి ప్రాణాలు కూడా కాపాడుతున్నారని అన్నారు.
భారతీయుడి పాత్ర
కిడ్నీ అమర్చే ఆపరేషన్ ప్రక్రియలో ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్, భారతదేశానికి చెందిన డాక్టర్ నీరజ్ దేశాయ్ పాల్గొనడం విశేషం. గ్రహీత గర్భాశయానికి సమీపంలో కొత్త కిడ్నీ అమర్చామని, ఉన్న రెండు కిడ్నీలలో దేన్నీ తీయలేదని డాక్టర్ దేశాయ్ వివరించారు. సాధారణంగా అయితే ఉన్నవాటిలో ఒకటి తీసేసి కొత్తది పెడతారు. కొత్త కిడ్నీ అమర్చాక 20-40 ఏళ్లు బతుకుతారని సెగెవ్ తెలిపారు. ఆ తర్వాత మరోసారి కిడ్నీ మార్పించుకోవాలి లేదా డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు.
1983లో మార్టినెజ్, ఆమె కవల సోదరి నెలలు నిండడానికి 12 వారాల ముందే పుట్టారు. దాంతో వాళ్లకు రక్తహీనత సమస్య తలెత్తింది. వాళ్ల తండ్రి నౌకాదళంలో పనిచేస్తుండటంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని సైనిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసరం కావడంతో తగిన పరీక్షలు చేయకుండానే రక్తం ఎక్కించారు. 8 ఏళ్ల వయసులో కంటి ఆపరేషన కోసం తీసుకెళ్లేవరకు కుటుంబంలో ఎవరికీ ఆమె హెచ్ఐవీ విషయం తెలియలేదు. స్కూల్లో ఉన్నపుడు వేరే ఎవరికీ ఆ వ్యాధి సోకకూడదని ఆమెను దూరంగా ఉంచేవారు. ఆమె మరణించేటపుడు ప్రభుత్వ సొమ్ముతో ఎందుకు చదివించాలని కూడా ఓ దశలో ప్రిన్సిపాల్ అడిగారు. అలాంటివాళ్లందరికీ ఇప్పుడు ‘మెంటల్ రీబూట్’ అవసరమని మార్టినెజ్ అన్నారు. హెచ్ఐవీ ఉన్నా అవయవ దానం చేయడానికి వీలు కల్పించే చట్టాన్ని 2013లో ఆమోదించారు.