వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాకు ఫిచ్ రేటింగ్స్ సంస్థ కోత పెట్టింది. ఇంతకుముందు 7 శాతంగా వృద్ధిరేటును అంచనా వేయగా, ఇప్పుడు దాన్ని 6.8 శాతానికి తగ్గించింది. దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నదాని కంటే మందగమనంలో ఉందని చెప్పింది. ప్రస్తుతానికి ఇది ఇలా ఉన్నా, ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం.. అంటే 2021లో మాత్రం అది 7.1 శాతానికి పెరగచ్చని గ్లోబల్ ఎకనమిక్ ఔట్ లుక్ పత్రికలో ఫిచ్ సంస్థ పేర్కొంది. ఇంతకుముందు డిసెంబరు ఆరో తేదీన ఫిచ్ సంస్థ 2019 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటును 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది.
ఆ తర్వాత 2020, 2021 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వృద్ధిరేటును కూడా 7.1 నుంచి 7కు, 7.3 నుంచి 7.1కు వరుసగా తగ్గించింది. రిజర్వు బ్యాంకు 2019 ఫిబ్రవరి నాటి సమావేశంలో వడ్డీ రేట్లను 0.25 శాతం చొప్పున తగ్గించిందని, దానివల్ల ద్రవ్యోల్బణం కాస్త తగ్గిందని ఫిచ్ తెలిపింది. తమ రేట్ దృక్పథాన్ని మార్చుకున్నామని, 2015లో మరో 25 బేసిక్ పాయింట్ల కోత ఉంటుందనుకున్నామని ఫిచ్ తెలిపింది. ఇక ఆర్థికరంగం విషయంలో 2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రైతులకు నగదు బదిలీ పెరుగుతుందని కూడా చెప్పింది. రాబోయే నెలల్లో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల గ్రామీణ కుటుంబాల ఆదాయానికి, వినియోగానికి కాస్త సాయం అందించాల్సి ఉంటుందని సూచించింది.