దుబాయి: భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే మృత్యువు వారిని ఏమీ చేయలేదట. దుబాయికి చెందిన భారతీయ జంట విషయంలో ఇది నిజమైంది. గతంలో ముంబై నగరం మీద ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడే ఉండి ప్రాణాలతో బయటపడి.. మళ్లీ ఇప్పుడు శ్రీలంక పేలుళ్లలోనూ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఆ భార్యాభర్తలు దుబాయి నుంచి బయటకు వేరేదేశం వెళ్లింది ఆ రెండుసార్లేనట. అభినవ్ చారి, ఆయన భార్య నవరూప్ కె. చారి వ్యాపారం పనిమీద శ్రీలంక వెళ్లి కొలంబోలోని సిన్నమోన్ గ్రాండ్ హోటల్లో బస చేశారు. అక్కడే ఈస్టర్ రోజున బాంబు దాడులు జరిగాయి.
తొలుత 2008లో ముంబై మహానగరం మీద ఉగ్రవాద దాడులు జరిగినపుడు కూడా అభినవ్ అక్కడే ఉన్నారు. ఐదారు రోజుల పాటు ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదని, పరిస్థితి అత్యంత భయానకంగా ఉండేదని అన్నారు. ఇక ఈస్టర్ ఆదివారం రోజున తాము చర్చికి వెళ్లామని, అక్కడ ప్రార్థనలు మధ్యలో ఉండగానే అందరూ చర్చి వదిలి వెళ్లిపోవాలని అక్కడి పెద్దలు చెప్పారని అన్నారు. తాము చర్చి నుంచి వెళ్లిపోతూ టాక్సీ ఎక్కి టిఫిన్ తిందామనుకున్నామని చెప్పారు. కానీ అప్పటికే రోడ్లన్నీ బాగా రద్దీగా ఉండటంతో నేరుగా హోటల్ కే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు. తాము అక్కడికి వెళ్లేసరికి అంతా లాన్ ప్రాంతంలో ఉండటంతో అదేదో భద్రతాపరమైన ముందుజాగ్రత్త అనుకున్నట్లు తెలిపారు.
నిజానికి సోషల్ మీడియాలో చూసి ఉన్నా అప్పటికి ఏం జరుగుతోందో తెలిసేదని, కానీ తాము మాత్రం ఆ విషయాన్ని పెద్దగా గుర్తించలేదని నవరూప్ చారి అన్నారు. తమ కళ్ల ముందు జరిగినదంతా ఓ సినిమాలాగే అయిపోయిందని చెప్పారు. అలా అదృష్టవశాత్తు రెండుసార్లూ భారీ ఉగ్రవాద దాడుల నుంచి వాళ్లు బయటపడిపోయారు. శ్రీలంకలో జరిగిన ఘోర బాంబు దాడులలో 253 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు.