మద్యపాన నిషేధానికి మూల సూత్రాలు ఏమిటి..? మద్యాన్ని పూర్తిగా నిషేధించడం సాధ్యమవుతుందా..? దుకాణాల తగ్గిస్తూ, ధరలు పెంచుతూ ఉంటేనే సాధ్యమా? అలవాటు ఉన్న వాళ్లు మద్యం మానేస్తారా..? ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యాన్ని నిషేధిస్తే ఎదురయ్యే పరిణామాలు ఏమిటి?? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది..? సీఎం జగన్ మదిలో ఏం ఆలోచన ఉంది..? ఇవన్నీ ప్రశ్నలే. మద్యపాన నిషేధంపై కరోనా లాక్ డౌన్ తర్వాత మద్యం అమ్మకాల తీరుపై.., ఎదురవుతున్న ప్రశ్నలు ఇవి. ఒక్కోటీ విప్పే ప్రయత్నం చేద్దాం.
ఆదాయం కోల్పోతారా…?
మీకు తెలుసా..? దేశంలో అత్యధిక ఆదాయ వనరు పెట్రోలియం. అదే రాష్ట్రాల్లో అయితే మద్యమే. ఆ తర్వాత స్థానంలో పెట్రోల్ ఉంటుంది. దేశం మొత్తం మీద సంవత్సరానికి సుమారుగా 1.75 లక్షలు కోట్లు మద్యం వ్యాపారం జరుగుతుంది. మన రాష్ట్రంలో చూసుకుంటే ఇది సుమారుగా రూ. 15 వేల కోట్లు ఉంటుంది. మొన్న ఒక్క రోజునే మద్యం దాదాపు రూ. 68 కోట్ల వ్యాపారం జరిగింది. దీనిలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా.., ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న కారణంగా మరింత ఆదాయం అవుతుంది. ఉదాహరణకు పై గోల్డ్ విస్కీ తీసుకుంటే.., ప్రస్తుతం ప్రభుత్వ అమ్ముతున్న ధర రూ. 650. ఆ తయారీ కంపెనీ నుంచి అది ప్రభుత్వానికి రూ. 210 కి వస్తుంది. అంటే దాదాపు 440 రూపాయలు ప్రభుత్వానికి మిగులే. దీనిలో ఎక్సైజ్ శాఖ నిర్వహణ, సిబ్బంది వేతనాలు.., ఇతర ఖర్చులు 50 శాతం తీసేస్తే మిగిలిన 50 శాతం ప్రభుత్వానికి నికర ఆదాయం. ఇలా సంవత్సరం మొత్తం మీద రూ. 7 వేల నుంచి 9 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి మిగులుతుంది.
ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు…?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2900 వరకు మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన సమయానికి దాదాపు 4400 దుకాణాలు ఉండగా.., వాటిని దశలవారీగా తగ్గిస్తూ తాజాగా కూడా 13 శాతం దుకాణాలు తగ్గించి ప్రస్తుతానికి 2934 దుకాణాల్లో నిర్వహిస్తున్నారు. మరోవైపు ధరలను భారీగా పెంచారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు సమయానికి బ్లెండర్స్ ప్రైడ్ అనే విస్కీ ధర 880 ఉండగా.., ప్రస్తుతం 1800 వరకు చేరింది. ఇదే బ్రాండ్ తెలంగాణలో ప్రస్తుతం రూ. 1250 కి లభిస్తుంది. ఇలా ఏపీలో ధరలు పెరిగాయి. మళ్లీ కావాల్సిన బ్రాండ్ దొరకడం లేదు. గడిచిన పది నెలల్లో అనేక కొత్త బ్రాండ్ లు పుట్టుకొచ్చాయి. వీటి నాణ్యత, తయారీ విధానం, ఏది ఎంతవరకు జరుగుతుందో అనేది ప్రశ్నర్ధకమే. అంటే ప్రభుత్వంలో గడిచిన ఏడాదిలో ధరలు పెంచారు, దుకాణాలు తగ్గించారు. కానీ కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేశారు. ఇవన్నీ మద్యపాన నిషేధంలో భాగమా..? ధరలు ధరలు పెంచితే, దుకాణాలు తగ్గిస్తే మద్యం అరికట్టినట్టేనా..??
నాటుని నియంత్రించగలరా…?
ఇదే కొనసాగితే, ధరలు భారీగా పెరిగితే.., కచ్చితంగా చీప్ లిక్కర్, నాటుసారా వంటివి పరుగులు పెడతాయి. ఇవి ఎప్పటి నుంచో కాసుకొని కూర్చున్నవే. మూలల్లోకి వెళ్లి నియంత్రించి ఘటన ఏనాడూ లేదు. ఈ సమస్య మారుమూల గ్రామాల్లో కూడా ఉంటుంది. ఇప్పటికీ ప్రతి జిల్లాలో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం ధరలు పెరిగితే.. పెరిగేది ఇదే. మరి దీనిపై కూడా సరైన సరైన నియంత్రణ ఉంటేనే, కట్టుదిట్టం చేయవచ్చు. అయితే అటు మద్యం దొరక్క, ఇటు ఈ పానీయాలు దొరక్కపోతే బానిసైన వారి నుంచి విచిత్ర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వీటన్నిటినీ తట్టుకోవాలి. ప్రభుత్వ ఆలోచన ఇప్పటివరకూ చూసుకుంటే… కేవలం ధరల పెంపు, దుకాణాల తగ్గింపు పైనే ఉంది. ఇలాగే కొనసాగితే మద్యపాన నిషేధం బెడిసి కొడుతుంది. కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి.