రాజకీయం పెద్దగా అనుభవం లేని జగన్ 2014 నాటికీ బొక్క బోర్లా పడినా, 2019 నాటికీ తాను ఏంటో చూపించారు…! ఇప్పుడు పరిపాలన అనుభవ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే అడుగడునా తలనొప్పులు. అన్నిటినీ అధిగమించి వెళ్తున్నా కోర్టుల రూపంలో పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాలనలోనైనా, రాజకీయంలో అయినా వ్యవస్థలను మేనేజ్ చేయడం తెలిసి ఉండాలి. చంద్రబాబు ఈ విషయంలో దిట్ట. అందుకే బాబు మీడియా మేనేజ్మెంట్, కోర్టుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవడం, ఇలా ఎక్కడ తన నిర్ణయాలు బెడిసికొట్టకుండా జాగ్రత్త పడతారు. జగన్ చీటికి మాటికీ అధికారులు వెళ్లి కోర్టుల్లో తప్పు చేతులు కట్టుకుని నిలబడేలా వ్యవహరిస్తున్నారు.
సలహాదారులు ఎందుకున్నట్టు…?
గతం లో ఏ ప్రభుత్వానికి లేనట్టుగా జగన్ చుట్టూ ఇప్పుడు సలహాదారులు ఎక్కువగా చేరారు. ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి తల పండిన మేధావులు సైతం ఉన్నారు. వీరికి తోడుగా ఇటీవల మరో సలహాదారుడు సాక్షి లో రెసిడెంట్ ఎడిటర్ గా చేసిన ధనుంజయరెడ్డిని తెచ్చి పెట్టుకున్నారు. నెల నెల రూ. లక్షల్లో వేతనాలు పొందుతున్నారు. మరి వీళ్ళు ఎందుకున్నట్టు? ఏంసలహాలు ఇస్తున్నట్టు?? వారికి ముందు తెలియదా?? ఏం చేస్తున్నారు ? ఎక్కడెక్కడ సమాధానం చెప్పుకోవాలి? ఏం సమాధానాలు చెప్పుకోవాలి? అనేది ముందుగానే పూర్తిగా సిద్ధమై రంగంలోకి దిగాలి కదా…! అదేమి లేక, ముందుచూపు వ్యవహారాలూ లేక చేసేసి, కోర్టుల ముందు చివాట్లు తినడం ఇప్పటికిప్పుడు జగన్ కి పెద్దగా నష్టం చేయకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
ముందున్నాయి కీలక సవాళ్లు…!
ఆంగ్ల మాధ్యమం, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, అమరావతిలో ఇళ్ల పట్టాలు దగ్గరి నుండి దాదాపు 50 సార్లు కోర్టులో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చాయి. ఇవి టిడిపికి ఆయుధంగా మారుతున్నాయి. ఉన్నవీ, లేనివి కలిపి ప్రచారం చేస్తున్నారు. ఇదే కొనసాగితే జగన్ కీలకమైన అమరావతి మార్పు, మండలి రద్దు, ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారాల్లో కూడా కోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తే జనం లో జగన్ పై చులకన భావం తీసుకువచ్చే ప్రమాదం ఉంది. జగన్ కి ముందున్న సవాళ్లు ఇవే. వీటిపై ముందస్తుగానే న్యాయ సూత్రాలు, కోర్టులో వాదనలపై సిద్ధమై వెళ్లడం శ్రేయస్కరం. ఇవేవి పెద్దగా ప్రజామోదం ఉన్న నిర్ణయాలని చెప్పలేం, అలా అని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా కాదు. అన్ని రాజకీయ నిర్ణయాలే, వీటికి మూల అర్ధం రాజకీయ ప్రయోజనాలే. అందుకే జగన్ సీఎం గా మంచి పేరు తెచ్చుకోవాలన్న, తన నిర్ణయాలకు తిరిగి ఉండదని చెప్పుకోవాలన్నా ఈ కీలక వ్యవహారాల్లో కోర్టులో గెలిచేలా వ్యవహరించాలి. సమర్ధనీయం వాదనలు వినిపించాలి. చూద్దాం ఈ నెల 28 న ఏం జరుగుతుందో.