ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయోపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదల అవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్, బొమ్మన్ ఇరానీ లాంటి వాళ్లు నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తాను పాటలు రాసినట్లుగా దాని పోస్టర్ లో ఉండటంపై ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బయోపిక్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అందులో జావేద్ అఖ్తర్ ను కూడా గేయ రచయితగా పేర్కొన్నారు. అయితే, తాను మాత్రం ఆ సినిమాకు ఒక్క పాట కూడా రాయలేదని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పెట్టడంతో పెను దుమారం చెలరేగింది.
Am shocked to find my name on the poster of this film. Have not written any songs for it ! pic.twitter.com/tIeg2vMpVG
— Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2019
బయోపిక్ ట్రైలర్ నుంచి ఒక స్క్రీన్ షాట్ తీసుకుని, దాన్ని అఖ్తర్ షేర్ చేశారు. తన పేరు వాడుకోవడం చూసి షాకయ్యానన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చీఫ్, ప్రముఖ గేయరచయిత ప్రసూన్ జోషి, సమీర్ తదితరులతో పాటు అఖ్తర్ పేరు కూడా పాటల రచయితలలో ఉంది. అఖ్తర్ ట్వీట్ ను 15వేల సార్లు లైక్ చేసి, 5,600 సార్లు రీట్వీట్ చేశారు. అయితే దీనిపై దర్శక నిర్మాతలు ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ మాత్రం ఇలా అఖ్తర్ పేరు వాడుకోడాన్ని పరువునష్టంగా పేర్కొన్నారు.
అయితే, దీనిపై ట్విటర్ లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అందులో పేర్కొన్న వ్యక్తి వేరే జావేద్ అఖ్తర్ అయి ఉండొచ్చని కొందరు అన్నారు. మరికొందరు పరువునష్టం దావా వేయాలని సూచించారు. అయితే, పుల్వామా దాడికి ముందు పాకిస్థాన్ తో సాంస్కృతిక సంబంధాలు కొనసాగిస్తున్నందుకు చాలామంది ఆయనను తిట్టిపోశారు కూడా. జావేద్ అఖ్తర్, ఆయన భార్య షబానా ఆజ్మీ గతంలో పాకిస్థాన్ తో సాంస్కృతిక సంబంధాలు ఉండాలని వాదించారు. అయితే, ఫిబ్రవరి 14 నాటి పుల్వామా దాడి తర్వాత వెంటనే వాటిని ఆపేస్తే బాగుంటుందని షబానా అన్నారు. కరాచీలో జరిగే ఓ కార్యక్రమానికి తాను రాలేనని అఖ్తర్ కూడా చెప్పారు.
I am filled with pain and grief and all else ..by the dastardly #Pulwama attack . For the 1st time in all these years I feel weakened in my belief that people to people contact can force the Establishment to do the right thing.We will need to call halt to cultural exchange
— Azmi Shabana (@AzmiShabana) February 15, 2019
పీఎం నరేంద్రమోదీ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రధాని మోదీ పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ బయోపిక్ దర్శకుడు ఒమంగ్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు సరబ్ జీత్, మేరీకోమ్ లాంటి సినిమాలు తీశారు. సినిమా ట్రైలర్ ముంబైలోని ఓ మల్టీప్లెక్సులో విడుదలైంది. తొలివిడత పోలింగుకు ముందే ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది.