హైదరాబాద్: ఇటీవల కాగజ్నగర్లో జరిగిన ఘటనకు సంబంధించి మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారిణి అనితతో సహా మరో 15మంది సిబ్బందిపై ఎస్సి, ఎస్టి వేధింపుల కేసు నమోదు అయ్యింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫారెస్ట్ అధికారిణి అనితతో సహా ఫారెస్టు సిబ్బంది పోడు భూములను దున్నేందుకు వెళ్లిన సందర్భంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కృష్ణారావు, ఆయన ఆనుచరులు కర్రలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ అఫీసర్ (ఎఫ్ఆర్ఒ) అనిత తీవ్రంగా గాయపడింది. అనిత ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సోదరుడు, అతని అనుచరులపై నాడు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకీ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఎఫ్ఆర్ఒ అనిత, ఫారెస్టు సిబ్బంది తనను కులం పేరుతో దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డారని సార్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు అనితతో పాటు మరో 15మంది ఫారెస్టు సిబ్బందిపై ఎస్సి, ఎస్టి వేధింపుల కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పి సత్యనారాయణ తెలిపారు.
కాగజ్నగర్లో అటవీ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనను కేంద్రం కూడా తీవ్రంగా పరిగణించింది. దాడి ఘటనపై హైదరాబాదులో అటవీశాఖ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కూడా తెలియజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా దీనిపై స్పందించి అక్కడి ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ప్రశ్నించారు. కెసిఆర్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికి కృష్ణారావుతో ఎమ్మెల్యే కోనప్ప రాజీనామా చేయించారు. దాడి ఘటనను పురస్కరించుకొని అధికారులపైనే కౌంటర్ కేసు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.