(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం కేసులో ఎమ్మెల్యే కోటం రెడ్డి అరెస్టు కావడంతో వైసీపీ నేతల మధ్య చిచ్చుపెట్టింది. ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల మధ్య విభేదాలను రోడ్డున పడేసింది. వెంకటాచలం ఎంపీడీవో సరళపై జరిగిన దాడికి.. వీళ్లిద్దరి మధ్య వివాదాలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి కాకాని గోవర్థన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బంధువులే. అయితే, కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షులుగా నిర్ణయించకముందు కోటంరెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చింది. జిల్లా అధ్యక్ష పదవి విషయంలో పోటాపోటీ రాజకీయమే నడిచింది. అయితే, చివరికి కాకాని జిల్లా బాధ్యతలు దక్కింది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డిని కాకుండా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణిని ఆహ్వానించడం, ఆ కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభించడంతో వీరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై జరిగిన దాడితో వీళ్ల వర్గపోరు రచ్చకెక్కినట్టయింది.
సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని గొలగమూడిలో లేఔట్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న రచ్చకు వర్గపోరే కారణమని తెలుస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బంధువు కృష్ణారెడ్డి లేఔట్ సర్వేపల్లి నియోజకవర్గంలోకి వస్తుంది. టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఇది మొదలుపట్టారు. అయితే, వాటర్ పైప్లైన్ అనుమతులు అక్కడి ఎమ్మెల్యే కాకాని అడ్డుకోవడం కోటంరెడ్డికి మింగుడు పడలేదు. లేఔట్కు నల్లా కనెక్షన్ ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నారు. అయినా కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఈ అంశమై ఎంపీడీవోను అడిగితే ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దన్నారని సమాధానం ఇచ్చారట. ఎమ్మెల్యే కాకాణికి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగితే ఇప్పుడు కుదరదు.. తర్వాత చూద్దాం అని అన్నారట. వాస్తవానికి ఈ లేఔట్ కు నల్లా కనెక్షన్ ఇస్తే.. సమీప గ్రామాలకు తాగునీటి కష్టాలు వస్తాయని కాకాణి వాదన. దీంతో ఆ లేఔట్ కు నల్లా కనెక్షన్ ఇవ్వకుండా దాటవేస్తున్నారు. తాను చెప్పినా పని జరగకపోవడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో పరిస్థితి కాకాణి వర్సెస్ కోటంరెడ్డిగా మారింది. వీరి మధ్య వివాదాలు ముదిరి… అనుచరులు, అధికారులపై దాడులు వరకు వెళ్ళింది.
ఎంపీడీవో సరళ ఇంటిపై కోటంరెడ్డి దౌర్జన్యం, తదనంతర పరిణామాలన్నీ కూడా రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నాయి. తన అనుచరుడికి సంబంధించిన లేఔట్ పర్మిషన్ల విషయంలో కాకాని కావాలనే జోక్యం చేసుకున్నారని కోటంరెడ్డి అంటున్నారు. లేఔట్కి అనుమతులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే కాకాని ఆదేశించారని ఎంపీడీవోనే స్వయంగా తనతో అన్నారని చెప్పారు. ఇదే విషయంపై కాకానితో మాట్లాడితే స్థలం వివాదంలో ఉందని చెప్తున్నారని.. కానీ నిబంధనల ప్రకారం నుడా, రెరా అనుమతులు అన్నీ సక్రమంగానే ఉందని వివరణ ఇచ్చారు. కొన్నాళ్లుగా తనను టార్గెట్ చేస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు. తనపై నమోదైన కేసును రాజకీయకుట్రగా కోటంరెడ్డి అభివర్ణించారు. ఈ కేసులో సూత్రధారులు వేరేవాళ్లు ఉన్నారని, ఎండీవో సరళ కేవలం పాత్రధారులేనని పేర్కొన్నారు.
తన అరెస్టు వెనుక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఉన్నాడని కోటం రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంటిపై దాడి చేశారని చెబుతున్న ఎంపీడీవో.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎమ్మెల్యే కాకాణి ఇంటికెళ్లారని కోటం రెడ్డి ఆరోపించారు. మొత్తం మీద తెరవెనుక నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్రెడ్డి ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని కోటంరెడ్డి వాదన. ఈ ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య కోల్డ్వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.