ఘజియాబాద్: యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం గత సంవత్సరం ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం కన్వరియాలపై ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ ఆకాశం నుండి గులాబీ రేకుల వర్షం కురిపించారు. మరోపక్కన ఉత్తరాఖండ్ ప్రభుత్వం కన్వరియాల వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందని అంటున్నది.
ప్రతి సంవత్సరం ఈ సీజన్లో హిందువుల పుణ్యస్థలాలైన రిషీకేశ్, హరిద్వార్, గోముఖ్, గంగోత్రికి శైవభక్తులు వెళ్లి గంగాజలం తెచ్చుకుంటారు. వీరిని కన్వరియాలు అంటారు.
జిల్లా మెజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే. పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ సింగ్ హెలీకాప్టర్లో గగనతలం నుంచి కన్వరియాలపై పూలవర్షం కురిపించారు.
కన్వరియాలు తీవ్రమైన శాంతి భద్రతల సమస్యను సృష్టించగలరన్నహెచ్చరికను ఉత్తరాఖండ్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలకు పంపింది. హోంశాఖ కార్యదర్శి ఆనందవర్ధన్ ఈ లేఖ పంపారు.
కన్వరియాలు కొందరు మాదకద్రవ్యాలు వాడతారని ఆ లేఖలో పేర్కొన్నారు. వారు క్రికెట్, బేస్బాల్, హాకీ బ్యాట్లు, త్రిశూలాలు వెంట తెచ్చుకుంటారు. దారిలో ఏదైనా చిన్న గొడవయితే వాటిని ప్రయోగించడానికి సందేహించరు. వారు దారిలో స్థానిక దుకాణదారులతో, జనంతో గొడవ పడతారు అని ఆ లేఖలో హెచ్చరించారు. వాహనాలపై యాత్ర చేసే కన్వరియాల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయని అందులో పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించగలవారిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం ఈ లేఖ పంపుతున్నట్లు పేర్కొన్నారు.