(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజకీయాల్లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయి, హోం, భారీ నీటి పారుదల, పంచాయతీరాజ్, హెల్త్ వంటి కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించి ఆపై నవ్యాంధ్ర శాసనసభ స్పీకర్గా వ్యవహరించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వార్త రాష్ట్రంలో సంచలనం కల్గించింది. కోడెల స్థాయి నాయకుడి జీవితం ఇలా విషాదాంతం కావడం అందరినీ నిర్గాంత పరిచింది. కోడెల వంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడా, నమ్మలేకపోతున్నామే అనే మాటలు వినబడుతున్నాయి.
కోడెల శివప్రసాదరావు వ్యక్తిగతంగా పిరికి మనిషి కాదు. చాలా నిబ్బరంగా ఉండే వ్యక్తి. వృత్తి రీత్యా వైద్యుడు అయినప్పటికీ ఆయన నెమ్మదస్తుడు కాదు. చాలా దూకుడుగా ఉండేవారు. ఎన్టి రామారావు మంత్రివర్గంలో హోంశాఖ అప్పగించినప్పుడు కూడా ఆయన దూకుడు వైఖరితోనే ఆ శాఖ నిర్వహించారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొని లోకం నుండి నిష్క్రమించాలనుకోవడం కోడెలతో పరిచయం ఉన్న వారికి మింగుడు పడటం లేదు.
ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయి, వైసిపి అద్భుత విజయం సాధించడంతో కోడెలకు కష్టాలు మెదలయ్యాయి. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తె బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. కొన్ని ఫిర్యాదులు కేసులుగా మారాయి. కె ట్యాక్స్ పేరుతో ఈ వసూళ్ళ వార్తలకు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. ఆయన కుమారుడు, కుమార్తె కోర్టుల నుండి ముందస్తు బెయిల్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదే ఇబ్బందికరం అనుకుంటే హైదరాబాద్లోని అసెంబ్లీ నుంచి అమరావతిలోని అసెంబ్లీకి తరలించిన ఫర్నీచర్లో కొంత భాగం కోడెల తన ఇంటికి తరలించారన్న ఫిర్యాదు గోరుచుట్టుపై రోకలిపోటుగా పరిణమించింది. అసెంబ్లీకి చెందిన కొన్ని కుర్చీలు కోడెల కుమారుడికి చెందిన మోటారు సైకిల్ షోరూమ్లో దొరకడం ఆయనకు చెప్పుకోలేని ఇబ్బంది కలిగించింది.
ఈ ఉదంతం తర్వాతే ఆయన తీవ్రమైన మానసిక వత్తిడికి లోనయ్యారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో కోడెల ఆసుపత్రిలో చేరారన్న వార్త వచ్చింది. ఆయనను అల్లుడికి చెందిన ఆసుపత్రిలోనే చేర్చారు. అప్పుడు కూడా కోడెల ఆత్మహత్యాయత్నం చేశారన్న పుకార్లు వినబడ్డాయి. చివరికి ఎంతకూ వదలని మానసిక వత్తిడిదే పైచేయి అయింది. ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అని కోడెల అంతిమంగా నిర్ణయం తీసుకుని నిష్క్రమించారు.