భోపాల్ (మధ్యప్రదేశ్): ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన భోపాల్ బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పే వరకూ ఆమెకు మద్దతుగా నిలిచేదిలేదని ఆ పార్టీ నాయకురాలు రసూల్ సిద్దిఖి పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పే వరకూ ప్రచారంలో పాల్గొనేది లేదని కూడా స్పష్టం చేసింది.
భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కు పోటీగా మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రజ్ఞా సింగ్ను బిజెపి నిలిపిన సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక టివీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబ్రీమసీదు విధ్వంసంలో మసీదు కూల్చిన బృందంలో తానూ ఉన్నాననీ, ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నందుకు గర్వపడుతున్నానంటూ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ విషయంపై ఫాతిమా రసూల్ సిద్దిఖి మాట్లాడుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పినందువల్లే తాను బిజెపిలో చేరానని చెప్పారు. ప్రజ్ఞాసింగ్ కారణంగా ముస్లింలతో సంబంధాలు కలిగి ఉన్న బిజెపి నేతల ఇమేజ్ కూడా దెబ్బతింటోందని పేర్కొంది. ఈ విధంగా మాట్లాడి ముస్లిం మనోభావాలను కించపరిచారని అందుకే ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆమె క్షమాపణ చెప్పే వరకూ ప్రచారంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు సిద్ధిఖి తెలిపారు.
ఫాతిమా సిద్ధిఖి నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి రసూల్ అహ్మద్ కుమార్తె అయిన ఫాతిమా 2018 నవంబర్లో బిజెపిలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భోపాల్ నార్త్ నుండి పోటీ చేసిన ఫాతిమా కాంగ్రెస్ అభ్యర్థి అరిఫ్ అక్వీల్ చేతిలో ఓడిపోయారు.
ఆరవ దశ ఎన్నికల్లో భాగంగా మే 12న భోపాల్లో పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.