భోపాల్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బిజెపి ఎంపి సాధ్వి ప్రజ్ఞా సింగ్ నేడు ప్రతిపక్షాలపై సంచలన ఆరోపణ చేశారు. ప్రతిపక్షం చేతబడి చేయడం వల్ల తమ పార్టీకి చెందిన నేతలు మరణిస్తున్నారంటూ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించారు. 20 రోజుల వ్యవధిలో బిజెపికి చెందిన అగ్ర నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేయిస్తున్నాయని ఒక సాధువు గతంలో ఒక సారి తనకు చెప్పారనీ ఆ విషయాన్ని అప్పట్లో తాను మరిచిపోయాననీ సాధ్వి గుర్తు చేసుకున్నారు. అగ్రనేతలు ఒక్కరొక్కరుగా మృతి చెందుతుండటంతో సాధువు చెప్పింది నిజమే అనిపిస్తోందని సాధ్వి పేర్కొన్నారు.