న్యూఢిల్లీ: అయోధ్య, వివాదాస్పద రామజన్మభూమి స్థలంలోని వివాదరహిత భాగంలో ప్రార్ధనలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘మీరు ఈ దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది’ అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పిటిషనర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పిటిషనర్పై అలహాబాద్ హైకోర్టు విధించిన అయిదు లక్షల రూపాయల జరిమానాను ఉపసంహరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంతకు ముందు అలహాబాద్ హైకోర్టులో ఇలాంటి పిటిషన్ మరోటి దాఖలయింది. అక్కడ నమాజు చేసుకునేందుకు అనుమతించాలన్న ఆ పిటిషనర్పై కూడా హైకోర్టు అయిదు లక్షల రూపాయల జరిమానా విధించింది.
మొన్న ఫిబ్రవరిలో బిజెపి నాయకుడు సుబ్రమణ్య స్వామి కూడా ఇలాంటి పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసారు. వివాద రామజన్మభూమి స్థలంలో ప్రార్ధనలు నిర్వహించేందుకు తనకున్న ప్రాధమిక హక్కును కాపాడాలని ఆయన కోరారు.