అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా ఇక్కడి పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నిన్న యూరప్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 26వ తేదీన తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఒక పక్క ఢిల్లీ, మరో పక్క రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ వీడనున్నారని ప్రచారం జరుగుతున్న టిడిపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి రామ్మోహనరావు, టిజి వెంకటేష్లు గురువారం ప్రధాని మోది, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షాలను కలిసి చర్చించారు. తమను ప్రత్యేక టీమ్గా గుర్తించాలని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడిని కలిసి వీరు లేఖ అందజేశారు.
మరో పక్క తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశమైయ్యారు. సుమారు 20మంది టిడిపి నేతలు ఈ సమావేశానికి హజరయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టిడిపిని వీడి బిజెపిలో చేరే విషయంపై వీరంతా సమాలోచనలు చేస్తున్నారనీ ప్రచారం జరుగుతుండగా పార్టీ వీడేది లేదని తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూలు స్పష్టం చేస్తున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్, జ్యోతుల నెహ్రూ, బొండా ఉమా, ఈలి నాని, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగళ్రాయుడు, వరుపుల రాజు, మీసాల గీత, కెఎ నాయుడు, బండారు మాధవనాయుడు హజరయ్యారు.
ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణకు సమావేశమయ్యామని చెబుతున్నప్పటికీ పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.