అమరావతి: నిన్నటి వరకూ వినబడిన ఊహాగానాలు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమాగా ప్రకటిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు టిడిపి రాజ్యసభ సభ్యులు లొంగిపోయారని గట్టిగా వినబడుతోంది. ఇవాళో రేపో సుజనా చౌదరి, సిఎం రమేష్ బిజెపి తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాస రావు కూడా బిజెపిలో చేరనున్నారని వినబడుతోంది. వారు ఇంతకుముందు ఈ ఊహాగానాలను ఖండించారు కానీ టిడిపిని వారు వీడడం ఖాయమనే అంటున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కూడా ఆ దిక్కుకు చూస్తున్నారని వినబడుతోంది. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నత స్థాయి రాజ్యాంగపదవిలో ఉన్న ఒక నేతను కలిసినట్లు తెలిసింది.
ప్రస్తుతం కుటుంబంతో విదేశీ పర్యటనలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తున్నారు. సుజనా చౌదరితో ఆయన మాట్లాడినట్లు కూడా తెలిసింది.
రాజ్యసభ సభ్యులను బయటకు వెళ్లకుండా నిలువరించడం ఆయనకు దాదాపు సాధ్యం కాకపోవచ్చు. అయితే దానికన్నా ఎక్కువగా ఆయనను కలవరపరుస్తన్నది శాసనసభ్యుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న. రాజ్యసభ సభ్యులు చూపించిన దారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా నడిస్తే చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారు.
టిడిపి నుంచి బిజెపిలోకి చేరికల వార్తలను ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి మాటలు ధృవీకరిస్తున్నాయి. గురువారం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బిజెపికి భారీగా వలసలు ఉంటాయని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు యూరప్ ట్రిప్ నుండి రాష్ట్రానికి వచ్చే సరికి చాలా మార్పులు చోటుచేసుకుంటాయని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందనీ, అది కేవలం బిజెపితోనే భర్తీ అవుతుందని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. కుటుంబ పార్టీ అయిన టిడిపిలో ఆఖరుకు తండ్రి, కొడుకు, బావమరిది మాత్రమే మిగులుతారని విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తమ పార్టీలోకి రావాలని బిజెపి నాయకులు అడుగుతున్న విషయాన్ని పలువురు టిడిపి నేతలు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. తమకు ఆహ్వానం వచ్చిందని అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డి ఇప్పటికే చెప్పారు.
వైసిపి ఫిరాయింపులను ప్రోత్సహించదని ఇప్పటికే ఆ పార్టీ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం టిడిపికి వైసిపి నుండి ఎటువంటి భయం లేకపోయినా బిజెపి నుంచి మాత్రం గడ్డు సమస్య ఎదురవుతోంది.