అమరావతి: పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని వైఎస్ జగన్ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పకుంటున్నారని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ట్విట్టర్ వేదికగా బుధవారం జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. జాబు రావాలి అంటే బాబు పోవాలి, బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు అంటూ ఇలా ఎన్నో అబద్దాలను పాదయాత్రలో జగన్ చెప్పారని లోకేష్ విమర్శించారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు హయాంలో 39,500 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు కల్పించారనీ, ఐటిలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారని లోకేష్ పేర్కొన్నారు.
‘ఇలానే ఎలక్ట్రానిక్స్ ఇంకా ఇతర రంగాలలో మేమిచ్చిన ఉద్యోగాలు, ఏర్పాటవుతున్న కంపెనీలు, రాబోయే ఉద్యోగాల వివరాలు కూడా బయటపెట్టి మీ పత్రిక అసత్యాల సాక్షి అని ప్రజలందరికీ తెలియజేయాలని జగన్ను కోరుతున్నాను’ అని లోకేష్ పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో యువతకు అందించబోతున్న మరో ఎనిమిది లక్షల పైచిలుకు ఉద్యోగాల వివరాల పట్టికను లోకేష్ పోస్టు చేస్తూ ఇవి కూడా తమరి ఘనతగా చెప్పుకుంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్లతో పాటు పలు కంపెనీల ఫోటోలను టాగ్ చేశారు.
ఏర్పాటవుతున్న కంపెనీల వివరాలు మీరెలాగూ బయట పెట్టరు. ఇవిగోండి! మీరు చెప్తున్న 5.60 లక్షల ఉద్యోగాలతో పాటు చంద్రబాబుగారి హయాంలో పనులు ప్రారంభించి, రాబోయే రోజుల్లో యువతకు అందించబోతున్న మరో 8 లక్షల పైచిలుకు ఉద్యోగాల వివరాలు. ఇవి కూడా మీ ఘనతగా చెప్పుకుంటారేమో! pic.twitter.com/y8yPoflq1s
— Lokesh Nara (@naralokesh) July 17, 2019
పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని @ysjagan గారు, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు. 'జాబు రావాలి అంటే బాబు పోవాలి', 'బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు' ఇలాంటి ఎన్నో అబద్దాలను పాదయాత్రలో చెప్పారు జగన్ గారు. pic.twitter.com/NUNSeibuUD
— Lokesh Nara (@naralokesh) July 17, 2019