(న్యూస్ ఆర్బిట్ డ్కెస్)
తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ చర్యలు మొదలు పెట్టిందా ? పలు పార్టీల్లో ఉన్న అసంతృప్తులు, కీలక నేతలకు గాలం వేస్తోందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణలో బతలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తున్న బిజెపి.. సీనియర్ నాయకులకు గాలం వేస్తుంది. అసంతృప్తులే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది కమలదళం. రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసి ప్రస్తుతం ఇంటికే పరిమితమైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులను బిజెపి ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నాయకులపై దృష్టిసారించింది. వారిని చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ ఉనికిలో లేకుండా పోవడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. తాజాగా సోమవారం టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇకపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలపై గురి పెట్టారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఓడిపోయినా.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ నాయకులు ప్రణాళిక రచించారు. ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్ నాయకులకు గాలం వేసి.. పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ కు చెందిన పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్ బాగుంటుంది అనే భావన కొందరు నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇక అధికార టీఆర్ఎస్ నుండి కూడా కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారని ధీమాలో ఉన్నారు బీజేపీ నేతలు.
కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. కర్ణాటక తరువాత దక్షిణాదిలో బీజేపీకి అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఊపులో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగా భారీ చేరికలను ప్రోత్సహించాలని వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే పలువురు కమల తీర్థం పుచ్చుకోగా త్వరలోనే భారీ చేరికలుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించుకోవడం బలమైన నాయకులను చేర్చుకోవడం, అధికార పార్టీని ఎదుర్కోవడం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అనే అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని భావిస్తోంది. ఆర్టీసీ సమ్మె లాంటి అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే, తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయా ? అనేది చూడాలి.