బెంగళూరు: టిక్ టాక్ మోజులో నేటి యువత తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటోంది. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో టిక్టాక్ సరదా విషాదం నింపింది. పట్టాలపై ముగ్గురు యువకులు వీడియోలను చిత్రీకరిస్తుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టిక్టాక్ చేసేందుకు షరీఫ్, మహ్మద్ మతీన్, జబిల్లా ఖాన్ అనే ముగ్గురు యువకులు శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే హెగ్డే నగర్ లో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. టిక్ టాక్ వీడియోలు చిత్రీకరిస్తుండగా యలహంక – బెంగళూరు ప్యాసింజర్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో షరీఫ్, మతీన్ అక్కడిక్కడే మృతి చెందారు. జబిల్లా ఖాన్ తీవ్రంగా గాయపడగా.. అతనిని యలహంకలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గరు ఆర్కే హెగ్డే నగర్ కు చెందిన వారుగా గుర్తించారు. టిక్ టాక్ వీడియోలో మునిగిపోయిన వీరికి రైలు చేసే శబ్దం కూడా వినిపించలేదని లోకో పైలట్ తెలిపారు.
గత జూన్ నెలలో తుమకూరులో 19 ఏళ్ల ఓ యువకుడు సరదాగా టిక్ టాక్ వీడియో చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుడి చేతిలో కాలు పెట్టి.. బ్యాక్ జంప్ చేయాలనుకున్నాడు. అయితే, బ్యాక్ జంప్ చేసే క్రమంలో కాస్త పట్టు తప్పింది. దీంతో సదరు యువకుడి మెడ భాగం విరిగిపోగా వెన్నుపూస ఎముకలు విరిగినట్టు వైద్యులు చెప్పారు. టిక్ టాక్ పిచ్చితో కొందరు యువకులు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.