న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని అరెస్టు చేస్తామని, అందుకు ఆధారాలు ఇవ్వాలని యూకే అడిగింది. కానీ ఆ సమయంలో భారతదేశం మాత్రం సరిగా స్పందించలేదు. ఈ సంచలన విషయాన్ని జాతీయ మీడియా చానల్ ఎన్డీటీవీ బయటపెట్టింది. మీసాలు పెంచుకుని, ఆస్ట్రిచ్ పక్షి తోలుతో చేసిన జాకెట్ వేసుకుని లండన్ వీధుల్లో నీరవ్ కనిపించిన విషయం తెలిసిందే. ఇది ఒక్కసారిగా సంచలనం రేపింది. అతడిని విచారించి, స్వదేశానికి అప్పగించాలని కోరడంలో తమ ప్రయత్నలోపం ఏమీ లేదని భారత సర్కారు చెప్పుకొంటూ వస్తోంది. కానీ, తమకు సమాచారం ఇవ్వాలని బ్రిటిష్ అధికారులు ఎన్నిసార్లు అడిగినా మనవాళ్ల నుంచి స్పందనే లేదట. అవసరమైతే యూకే నుంచి ఒక లీగల్ టీమ్ ఇక్కడికొచ్చి సాయం చేస్తామని చెప్పినా మనవాళ్లు కదలితే ఒట్టు. పరస్పర న్యాయసహాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ) కింద 2018 ఫిబ్రవరిలో తొలిసారి ఒక ఎలర్ట్ భారతదేశం నుంచి యూకేకు వెళ్లింది. రూ. 13వేల కోట్ల స్కాంలో నీరవ్ మోదీ, అతడి కుటుంబ సభ్యులపై సీబీై తొలిసారి క్రిమినల్ కేసు పెట్టినపుడే అది పంపారు.
ఉన్నాడని చెప్పినా…
గతంలో న్యాయసహాయం అంటే చాలా కష్టం అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ నేరుగా సమన్లు లేదా వారంట్లను లండన్ లోని భారత హైకమిషన్ వర్గాలకు పంపచ్చు. వాళ్లు అక్కడి అధికారులకు వాటిని అందిస్తారు. కానీ, లండన్ అధికారులు తమ సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు (ఎస్ఎఫ్ఓ) ఈ కేసును చూస్తే బాగుంటుందని భావించారు. నీరవ్ మోదీ యూకేలో ఉన్న విషయాన్ని మార్చిలోనే ఎస్ఎఫ్ఓ అధికారులు భారతదేశానికి తెలిపారు. ఆ సమయంలో భారత అధికారులు మాత్రం అతడు యూరప్ లేదా హాంకాంగ్ లలో ఉన్నాడేమోనని మల్లగుల్లాలు పడుతున్నారు. ఇండియాకు సాయం చేయడానికి బారీ స్టాన్ కోంబ్ అనే న్యాయవాదిని కూడా ఎస్ఎఫ్ఓ అధికారులు నిర్ధరించారు. అతడు మనీలాండరింగ్ తదితర కేసుల్లో నిపుణుడు.
మేమే వస్తాం.. సాక్ష్యాలివ్వండి
భారతదేశం పంపిన పత్రాలు చూసిన తర్వాత మరిన్ని ఆధారాలు అవసరమని స్టాన్ కోంబ్ బృందం భావించింది. అదే విషయం గురించి మూడు లేఖలు రాసినా వారికి సమాధానం రాలేదు. అవసరమైతే తామే భారత్ వచ్చి సాక్ష్యాలు సేకరించుకుని వెళ్లి నీరవ్ మోదీని అరెస్టు చేస్తామని చెప్పినా మనవాళ్లు స్పందించలేదు. ఈలోపు నీరవ్ మోదీ జాగ్రత్త పడి, సొంత న్యాయవాద బృందాన్ని సిద్ధం చేసుకున్నాడు. రాజకీయ ఆశ్రయం కావాలని కోరాడు. కమల్ రెహ్మాన్, అతడి జూనియర్ ఆనంద్ దూబే అనే ఇద్దరు న్యాయవాదులు మిష్కాన్ అనే న్యాయవాద కంపెనీ తరఫున నీరవ్ మోదీ కోసం పనిచేస్తున్నారు. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద తనను అప్పగించవద్దని, ఆశ్రయం కల్పించాలన్నది నీరవ్ కోరిక.
మీకే ఆసక్తి లేకపోతే..
సీబీఐ, ఈడీలు రెండు సార్లు నీరవ్ మోదీని అప్పగించాలని గత ఆగస్టు నాటికే కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. కానీ అదనపు పత్రాలు కావాలని యూకే అడిగిన విషయమే తమకు తెలియదన్నారు. అయితే, ఈ విషయంలో భారతదేశానికి పెద్దగా ఆసక్తి ఉన్నట్లు లేదని డిసెంబరు తర్వాత ఎస్ఎఫ్ఓ వర్గాలు దీన్ని పట్టించుకోవడం మానేశాయి. దీనిపై వ్యాఖ్యానించేందుకు ఎస్ఎఫ్ఓ వర్గాలతో పాటు స్టాన్ కోంబ్ కూడా నిరాకరించారు.